#


Index

చిత్రతరంగిణి

భాసించటానికే విభూతి అని పేరు. ఎన్ని రూపాలుగా భాసించినా అన్నింటిలోనూ దాగి ఉన్న స్వరూపం మరలా ఒక్కటే. అది మరచి ఈ విభూతిని మాత్రమే దర్శించేవాడి దృష్టి పాక్షికమైనది. సకల జగద్వ్యాప్తమైన సత్యాన్ని ఏకదేశ పర్యవసాయిగా భావించటం పాక్షికం గాక మరేమిటి. ఇలాంటి వారి కోసం చెప్పిందే గదా జాత్యంధ గజదృష్టాంతం. ఒకడు దాని తోకపట్టుకొని బల్లెంలాగా ఉందంటే- మరొకడు తొండం పట్టుకొని రోకలిలాగా ఉందంటాడు. ఇప్పుడా ఇద్దరూ గజాన్ని చూచినట్టా - చూడనట్టా, చూచారు, చూడలేదు. తోకదాకా చూచారు. తొండం దాకా చూచారు. కాని వాటన్నిటినీ కలుపుకొన్న మొత్తం గజశరీరాన్ని దర్శించినవారు కారు.

  అలాగే ఈ స్వామినొకడు విష్ణువని చూస్తే- మరొకడు ఈశ్వరుడని చూస్తే -వేరొకడు శక్తి అని భావిస్తే ఒక్కొక్క రొక్కొక్క నామరూపాలాయన కారోపిస్తున్నారు. అయితే వీరి ఆరోపణలన్నిటికీ అతీతమైన ఆతత్త్వం తనలోతాను మన అజ్ఞానానికి నవ్వుకొంటూ .ఆ స్మితవదనం తోనే మనకు నిత్యమూ దర్శన మిస్తున్నది. పరస్పర దూషణాలాప దూషితమైన వీరి ముఖాలను చూడలేక నేత్రద్వయ నిమీలనం చేసుకొంటున్నది. ఇన్ని విభేదాలెందుకు మీకు - నాపాదా లాశ్రయించండి అవే మీకు పరతత్త్వాన్ని తెలుపుతాయని చేతితో చూపెడుతున్నది. బుధౌ శరణ మన్విచ్ఛ. మానసికమైన శరణాగతి ఉండవలెనే గాని నీకు నాతత్త్వం ఆత్మతత్త్వంగానే సాక్షాత్కారిస్తుందని అభయమిస్తున్నది. ఇలా అర్థం చేసుకోగలిగితే స్వామి నిజంగా మన పాలిటికి వేంకటుడే. సమస్త పాపాలనూ పరిహరించే వాడే వేంకటుడు. అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాశుచః' అని గదా స్వామి ఇచ్చిన హామి. అయితే ఆ స్వామి ఎక్కడ ఉన్నాడింతకూ. ఎక్కడేమిటి వేంకటుడే గాక ఈశ్వరుడు కూడ గదా. 'ఈశ్వర స్సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్ఠతి' మనందరి హృదయాలలోనే మన ఆత్మ స్వరూపంగానే ఉన్నాడు. ఇక మనకు భయమేమిటి. 'ద్వితీయాద్వై భయం భవతి!' భిన్నంగా చూచినప్పుడే భయం. అప్పుడే అది శివుడా-విష్ణువా- కమలభవుడా - అని ప్రశ్న. లేకుంటే అవి మూడూ కాదు. మూడు కలిసి బ్రహ్మమే, పరబ్రహ్మమే. పరమ భాగవతుడు త్యాగయ్య స్వామివారిని దర్శించి గానం చేసిన తత్త్వమదే. అదే ఏ క్షేత్రంలో ఏ దేవుని దర్శించినా అసలీ చరాచరక్షేత్రాలలోనే మనకేది తారసిల్లినా మనం చూడవలసిన పాడవలసిన అనుభవించవలసిన పది మందికీ అందీయవలసిన - పరమ సత్యం. పరమ రహస్యం, చివరకు జీవిత పరమార్ధం.

Page 80

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు