#


Index

చిత్రతరంగిణి

రూపమైనది. రెంటికీ భక్తి అని పేరు పెట్టటం వల్ల ఇవి రెండూ ఒకటేనని అపోహపడతారు చాలామంది, ఏమీ తెలియని పామరులే కాదు, అన్నీ తెలిసిన పండితులు కూడా. కనుకనే దాని నుంచి దీనిని వేరు చేసి చూపటానికి భగవద్గీత దీనిని పరాభక్తి అని, అనన్య భక్తి అని, ఏకభక్తి అని విశేషంగా నిర్దేశిస్తుంది. “భక్తిమ్ మయి పరామ్ కృత్వా భక్త్యా త్వనన్యయా ఏక భక్తి ర్విశిష్యతే". ఇలాంటి వెన్నో ఉదాహరణలు. దీని కనుగుణంగా భాగవతాది పురాణాలు కూడా ఇరుదెరగుల భక్తులనూ వారి చరిత్రలనూ వేర్వేరు లక్షణాలతో వర్ణిస్తూపోతాయి. అంబరీషాదుల భక్తి ప్రహ్లాద కుచేలాదుల భక్తిలాంటిది గాదు. వారిది జ్ఞానార్జన కోసం దానికి పూర్వ మభ్యసించిందయితే వీరిది జ్ఞానానంతరం తన్నిష్ఠా రూపమైన భక్తి కనుకనే వారి కున్న ఆచార వ్యవహార నియమాలు వీరికి లేవు. మరి గజేంద్రుడి విషయంలో నైతే ఒక భాగవతుడి పూర్వాపర జీవితాలు రెండూ వర్ణించాడు మహర్షి. ఇంద్రద్యుమ్న జన్మలో జ్ఞాన హితమైన సగుణ భక్తి అయితే గజేంద్రుడి జన్మలో జ్ఞానపూర్వకమైన నిర్గుణ భక్తి. కనుకనే ఇంద్రద్యుమ్నుడు శాపఫల మనుభవిస్తే గజేంద్రుడు మోక్షఫల మను భవించాడు. శాపం సగుణం నుంచి నిర్గుణాన్ని చేరేందుకొక వ్యాజమే.

  మొత్తానికి భక్తి మొదట జ్ఞానానికి దారితీస్తే ఆ జ్ఞానం మరలా భక్తిచేత పరిపూర్ణ మవుతుంది. భక్తి-జ్ఞానం- భక్తి- ఇదీ వరస. ఇందులో మొదటి భక్తి సగుణం. రెండవది నిర్గుణం. సగుణం నిర్గుణ స్థాయికి వస్తేనే ముక్తి. అది జ్ఞానం ద్వారానే తప్ప వేరొక మార్గం లేదు. ఈ రహస్యం భాగవతారంభంలోనే గొంతెత్తి చాటాడు మహాకవి. "ఇంచుక మాయలేక మది నెప్పుడు బాయని భక్తితోడ వర్తించుచు" మాయ లేకపోవట మంటే అజ్ఞానం తొలగిపోవటం. అంటే యథార్థమైన జ్ఞాన ముదయించట మని అర్థం. అలాంటి జ్ఞాన ముదయిస్తేనే మది నెప్పుడూ పాయని భక్తి ఏర్పడుతుంది. పాయని భక్తి అంటున్నాడు గమనించండి. ఇది అనన్య భక్తి మామూలు భక్తి కాదు. జ్ఞానానంతరమే కలుగుతుందది. అప్పుడు ఒక మదిలోనే గాదు, జీవితంలో కూడా ప్రవేశిస్తుంది. పానీయంబులు ద్రావుచున్ అన్నట్లు వాక్మ రీరాలతో ఏ పని చేస్తున్నా భయంలేదు. వర్తించట మంటే ఇదే. జీవించట మని అర్థం.

Page 73

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు