#


Index

చిత్రతరంగిణి

  అయితే ఇది సగుణభక్తి అని పేర్కొన్నాము. యథార్థమైన జ్ఞానంతో ఏర్పడింది కాదీ భక్తి. అలాంటి జ్ఞాన మేర్పడటానికి సాగించే ఒకానొక అభ్యాసం. అంచేత ఇది జ్ఞానాని కనంతర దశకాదు. దానికి పూర్వదశ. సగుణరూపం గనుక ఇందులో ఒక విగ్రహమనీ మంత్రమనీ ఆరాధన అనీ ఇలాంటి కలాపమంతా ఉండక తప్పదు. నామరూపాలనేవి నానా విధాలు కాబట్టి వాటిలో భక్తుడు తనకేది ఇష్టమైతే దానినే అభిమానిస్తాడు. ఆ రూపం వాడికిష్టదైవత మవుతుంది. శైవులకు లింగరూపుడైన శివుడయితే, వైష్ణవులకు శంఖ చక్ర వనమాలాది భూషితుడైన మహావిష్ణువు. ఇలా ఎన్నో దేవతామూర్తులు. వాటి కనుగుణమైన పంచాక్షర్యాది మంత్రజపాలు. వాటికి సంబంధించి అర్చనాది క్రియాకలాపం. అంతా ఒక పెద్ద ప్రపంచం. మనం లోకంలో మామూలుగా వర్ణించే భక్తి ఇదే. శాస్త్రంలో వర్ణించే భక్తి మార్గం కూడా చాలావరకిదే. అయితే ఇదంతా కూడా జ్ఞానానికి పూర్వరంగమే.

  పోతే ఇలాంటి భక్తిమార్గంలో పయనించే కొద్దీ కొంతకాలానికా భక్తుడి కొకవిధమైన చిత్త పరిపాక మేర్పడుతుంది. వ్యష్టిరూపమైన ఈ భావన క్రమంగా అతణ్ణి సమష్టి వైపు తీసుకెళ్లుతుంది. అది సహజం కూడా. ఎందుకంటే సమష్టి చైతన్యమే అసలు సర్వత్రా ఉన్నది. అదే ఈ వ్యష్టి రూపాన్ని ధరించి మనకు కనిపిస్తున్నది. అంచేత ఈ నదిలో పడి ఈదుతూ పోతే ఎప్పటికైనా ఆ మహాసముద్రాన్ని చేర్చకపోదు. ఎటు వచ్చీ అటు వైపు సాగిపోయే సన్నద్ధత ఉండాలి మనకు. అంటే ఏ మూర్తి విశేషాన్ని ధ్యానిస్తున్నా అది ఆ సమష్టికి ప్రతీకేనని తద్వారా ఆ సమష్టినే భజిస్తున్నాననే భావన ఉండాలి. అలాంటి భావన ఉంటేనే క్షేమం. లేకుంటే తనదేగొప్ప మిగతా వాళ్ళదంతా తక్కువ అనే భేదదృష్టికీ పరస్సర విద్వేషానికీ దారి తీస్తుందది. అప్పుడది భక్తికాదు. భక్త్యాభాస.

  ఇలా నిజమైన భక్తి గలిగి వ్యష్టి ద్వారా సమష్టి నెప్పుడు భావిస్తామో అప్పుడది బాగా పాకానికి వచ్చి వెంటనే జ్ఞానంగా మారిపోతుంది. కారణమేమంటే సమష్టి మీద కూడ దృష్టి ఉంది వాడికి. సమష్టి అనేది పరిచ్ఛిన్నం కాదు. సర్వవ్యాపకం. వ్యాపకమయ్యే కొద్దీ దానికి నామరూపా లంతకంతకు దూరమవుతాయి. దూరమైతే చివర కాకాశంలాగా అది పూర్తిగా అమూర్తమయిన భావమవుతుంది. అప్పుడు ఒక

Page 70

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు