ఆ పరమాత్మ సృష్టించిందే. ఆయన సృష్టి ఆయనకు విజాతీయ మెలా అవుతుంది. సువర్ణ నిర్మతమైన ఆభరణం సువర్ణానికెలా వ్యతిరిక్తం కాదో మృత్తికాజన్యమైన ఘటశరావాదులు మృత్తిక కెలా వ్యతిరిక్తం కావో - అలాగే చైతన్య వివర్తమైన ఈ సమస్త ప్రపంచమూ కూడా ఆ చైతన్యానికి విలక్షణం కాదు.
అయితే ఎంతవరకంటే అది అవ్యక్తమైతే ఇది వ్యక్తం. అది అత్యంత సూక్ష్మమైతే ఇది స్థూలం. అది నిరాకారమైతే ఇది సాకారం. అది సర్వవ్యాపకమైతే ఇది ఏకదేశ నియంత్రితమై ఎక్కడికక్కడ సవిశేషంగా భాసిస్తుంది. అలా భాసించే సరికా విశేష రూపాలలోనే నిమగ్నమైన వీటి కధిష్ఠానమైన ఆ మూల తత్త్వాన్ని విస్మరించారు నూటికి తొంభయి తొమ్మిది మంది. వీరే లౌకికులు. అలా కాక ఇవన్నీ ఆ చైతన్యం దాల్చిన రూపాలే దాని విభూతి శకలాలేనని భావిస్తూ వీటి ద్వారా ఆ తత్త్వాన్ని అందుకోవాలని ప్రయత్నిస్తాడెవడో ఒక మహనీయుడు. వాడే భక్తుడనేవాడు. అయితే వాడి భక్తి సగుణం. ఈశ్వర స్వరూపాన్ని ఉన్నదున్నట్లు భావించటం లేదువాడు. నామరూపాదుల నాలంబనం చేసుకొని తద్వారా భావిస్తున్నాడు. అవి ఆ పరమాత్మ విభూతే అయినా ఆయన లాగా నిత్యసిద్ధం కావు. ఎప్పటికప్పుడు మారే స్వభావం వాటిది. మారటం మూలాన సర్వ వ్యాపకం కానేరవు. దేనిపాటి కది వేరువేరయి అంతా కలిపి ఒకటిగా చూడటాని కవరోధక మవుతాయి.
కాని గ్రుడ్డికన్నా మెల్లకొంత మేలన్నట్లు దీనిలో ఒక సుగుణమున్నది. అలా లేకపోతే మామూలు మానవుడి దృష్టికి ఒక భాగవతుడి దృష్టికి తేడా లేకుండా పోతుంది. మామూలు వాడు తత్త్వాన్ని మరచి కేవల నామరూపాలు మాత్రమే చూస్తూ వాటితోనే లావాదేవీ పెట్టుకొంటాడు. వాడికీ భౌతిక జగత్తే తప్ప ఈ అనేకత్వంలో అంతర్లీనమైన ఆ ఏకత్వం మనసుకు రాదు. పోతే భక్తుడి విషయ మలాకాదు. అతడీ కనిపించే దంతా భగవద్విభూతే నని ఏకైకమైన ఆ సూత్రాన్ని వదలకుండా దాన్ని పట్టుకోటానికీ నామరూపాదులలో ఏదో ఒకటి ఆధారం చేసుకొని ప్రయాణం సాగిస్తాడు. నామానికి ప్రతీకగా మంత్రాన్ని రూపానికి ప్రతీకగా విగ్రహాన్ని స్వీకరించి వాటిని తదేక దృష్టితో చూచే మానసిక ప్రయత్న మంతా క్రియకు మారుగా భావిస్తాడు. ఇలా ఈశ్వరసృష్టి అయిన నామరూప క్రియలనే ఈశ్వరతత్తాన్ని భజించటాని కాలంబనంగా చేసుకొని పయనించటమే భక్తి.
Page 69