రెండు తత్త్వాలూ తిలతండులాల లాగా కలిసి మెలిసి కనబడతాయి. ప్రపంచంలో ఏ పదార్థమైనా చూడునీవు. దానికొక నామమని రూపమని ఉండకుండా పోవు. ఈ నామరూపాలు జగత్తు భాగం. అలాగే అవి రెండూ ఉన్నవని కనపబడుతున్నవనే చూస్తూంటాము మనం. ఇదుగో ఈ అస్తిత్త్వమూ ప్రకాశత్వమనేవే ఈశ్వర భాగం. సగుణమైన ఈ భావాన్ని మనసులో పెట్టుకొనే పార్వతీ పరమేశ్వరౌ అని ఇద్దరినీ కలిపి కీర్తించాడు మహాకవి.
కాని ఈ సగుణ దృష్టి మానవుడికి ముక్తి నీయదని కదా వర్ణించామింతకు ముందు. ముక్తి కావాలంటే సగుణాన్ని ఎప్పటికైనా నిర్గుణంగానే దర్శించాలి. అలా దర్శించాలంటే ఏమిటుపాయం. మనలోపలా వెలపలా కనిపించే రూపాల నన్నింటినీ కేవలం అస్తి భాతి అని సామాన్య రూపంగా భావిస్తూ పోవాలి. నామరూపాలనేవి విశేషాలు. సచ్చిత్తులు సామాన్యం. సామాన్యమే విశేష రూపంగా భాసిస్తుంటుంది మన అజ్ఞానం వల్ల. అది మరలా సామాన్యమేననే జ్ఞానంతో చూస్తే సామాన్యంగానే మారి కనిపిస్తుంది. ఇది ఒక సార్వత్రికమైన సూత్రం. మృద్ధటాదులన్నీ దీని కుదాహరణమే. దీనిని బట్టి తేలిందేమంటే ప్రస్తుత మీ నామ రూపాత్మిక అయిన ప్రకృతి లేదా పార్వతి సచ్చిదాత్మకమైన ఆ పరమేశ్వరుడి కన్నా ఏ మాత్రమూ వేరు గాదు. ఈశావాస్య మీద మన్నట్లు ఈశ భావనతో చూస్తూ పోతే ఇది ఆ ఈశ్వరుడితో పూర్తిగా ఏకమై తదీయ శక్తిగానే నిలిచిపోతుంది. మరి ఈ రహస్యం దృష్టిలో ఉంచుకొనే మహాకవి పితరౌ అని మరొక విశేషణం ప్రయోగించాడు. పితరౌ అనేది పార్వతీ పరమేశ్వరౌ అని పదం మాదిరి ద్వివచనాంతమే అయినా అందులో కనిపించినట్లు ఇందులో రెండు తత్త్వాలూ విడిగా కనిపించవు. దీనిని భాషలో ఏక శేషమని వ్యవహరిస్తారు. రెండు తత్త్వాలలో ఒకటి లుప్తమై ఒకటి మాత్రం మిగిలితే అది ఏక శేషం. మాతాపితరౌ అనే రెండింటిలో మాతృ శబ్దం లుప్తమై పితృ శబ్దం మాత్రమే మిగిలిందిక్కడ. అదే పితరౌ అనే రూపం. దీనిలోనే మాతృ శబ్దార్థం గర్భితమై ఉంది. అంటే నామ రూపాత్మకమైన ఈ ప్రపంచమంతా శుద్ధమైన చైతన్యంలో ప్రవిలయమై చైతన్యాత్మకంగానే శేషిస్తుందని- తత్త్వాన్ని మనమలాగే దర్శించాలని తాత్పర్యం.
Page 64