#


Index

చిత్రతరంగిణి

ఏకంగానంటే మరలా ఒక ప్రశ్న వస్తుంది. రెండు తత్త్వాలు దేనిపాటి కది వేరుగా ఉండి కలిసినా అది ఏకమే. అలా కాక ఒకటి మరొక దానిలో చేరి వేరుగా కనపడక పోయినా అది ఏకమే. మొదటిదాని కుదాహరణ తిలతండుల న్యాయం. రెండవ దానికి క్షీర నీర న్యాయం. నువ్వులూ బియ్యమూ ఒకదానిలో ఒకటి బాగా కలిసిపోయినా విడివిడిగా కనిపిస్తూనే ఉంటాయి. మరి పాలూ నీరైతే అలా కనిపించవు. నీరు పాలలో కలిసిందంటే పాలే కనిపిస్తాయి గానీ నీరనేది ఇక ఏ మాత్రమూ గోచరం కాదు.

  ప్రస్తుతమీ వాగర్థ స్వరూపులైన పార్వతీ పరమేశ్వరుల ఏకత్వమెలాంటిది. అది తిలతండులాల వంటిదా లేక క్షీర నీరాల లాంటిదా. రెండూనని చాటుతారు ఆధ్యాత్మ విద్యా విశారదులు. సగుణ మనుకొంటే అది తిలతండులాల వంటిది. అదే అర్ధనారీశ్వర భావం. ప్రకృతి పురుష రూపాలు రెండూ కలిసి ఉన్నా యందులో కలసి ఉండట మేకరూపమైనా రెండు అనే భావం మనసుకు వస్తూనే ఉంది. పోతే సగుణం గాక నిర్గుణమని భావిస్తే ఇక రెండనే ప్రసక్తే లేదు. అది క్షీర నీరాల కలయిక లాగా ఒక్కటే తత్త్వం. దీనికి ప్రతీక దక్షిణామూర్తి అనే భావం. దక్షిణ తప్ప వామ అనే భావం లేదిక్కడ. వామ దక్షిణలో చేరిపోయింది. దక్షిణ జ్ఞానశక్తి అయితే వామ క్రియాశక్తి. క్రియ లేని జ్ఞానముండగలదు గాని జ్ఞానం లేని క్రియ మాత్ర ముండలేదు. అంచేత జ్ఞానమే స్వరూపం పరమాత్మకు. క్రియ అనేది దాని విభూతి. విభూతికి రాకపోక అనేవి ఉంటాయి. కాబట్టి అది అనిత్వం. జ్ఞానం రాకపోకలు లేనిది కాబట్టి నిత్యం. నిత్యమైనదే సత్యం. దాని ఆభాస అసత్యం. అది దాని నాశ్రయించి దానితో ఓతప్రోతమై ఉంటుందెప్పుడూ. పాలలో నీరలాగే కదా ఉంది.

  కాగా ఈ నిర్గుణ తత్త్వాన్ని అందుకోటానికే మానవుడు చేయవలసిన కృషి అంతా. సగుణంలో ఎంత కృషిచేసినా అది సంసార బంధంలో పడదోసేదే గాని మోక్ష దాయకం కాదు. మోక్షమనేది ఏకరూపమైన నిర్గుణ భావనలోనే ఉంది. దానికి భిన్నంగా అనేక రూపమైనదీ సంసారం. ఇది త్రిగుణాత్మిక అయిన ప్రకృతి విలాసం. దీనిని లయం చేసుకొన్నప్పుడే సాధకుడికి మోక్షం. ఎలా లయ మవుతుందిది. అదియే మూల తత్త్వం నుంచి వచ్చిందో ఆ దృష్టితో చూస్తేనే లయ మవుతుంది.

Page 62

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు