వాగర్థావివ సంపృక్తా
వాగర్థావివ సంపృక్తా – వాగర్థ ప్రతి పత్తయే
జగతః పితరౌ వందే - పార్వతీ పరమేశ్వరౌ.
ఇది కాళిదాసు మహాకవి సూక్తి. ఈ సూక్తిలో ఒక వంద సూక్తుల భావ మిమిడి ఉంది. పార్వతీ పరమేశ్వరుల కిద్దరికీ నమస్కరిస్తున్నాడు కవి. మాతృదేవో భవ - పితృదేవోభవ - అని గదా శాస్త్రం చెబుతున్నది. తల్లిదండ్రులకు నమస్కరించట మనేది ఏ మానవుడికైనా విధ్యుక్త ధర్మమే. అందులోనూ వీరు జగత్తుకంతా తల్లిదండ్రులు. పురాణ దంపతులు. కాబట్టి మన తల్లిదండ్రులకు కూడా తల్లిదండ్రులు వారు. కాబట్టి ఒక్క కాళిదాసుకే గాదు లోకులందరికీ వందనీయులే సందేహం లేదు.
అయితే ప్రత్యక్షంగా కనపడే వారికైతే వందనం చేయగలం గాని పరోక్ష రూపులైన ఆ పురాణ దంపతుల కెలా చేయగలం. వారెంత పరోక్ష రూపులో అంత ప్రత్యక్ష రూపులు కూడా. నామ రూపాత్మకంగా కనిపించే ఈ సమస్త సృష్టి వారి రూపమే. నామరూపాలనేవి నిత్యమూ మనకు ప్రత్యక్షమే గదా. కనుక వారూ మనకు ప్రత్యక్షమే.
నామరూపాలకే వాగర్థాలని మారుపేరు. వాక్కంటే శబ్ధమే. వాగర్థాలన్నా శబ్దార్థాలన్నా ఒక్కటే. శబ్దం నామమైతే అర్థమనేది దాని రూపం. నామరూపాలంటే అప్పటికి శబ్దార్ధాలే నన్నమాట. ఒకటి ఫలానా అని మనకు కనిపింప జేసేది. మరొకటి కనిపించేది. బాహ్యమైన చర్మ చక్షుస్సుకే గాదు. ఆంతరమైన మనో నేత్రానికి కూడా. దీనిని బట్టి బాహ్యాభ్యంతర ప్రపంచాలు రెండూ శబ్దార్థాలే వాగర్ధాలే. ఈ వాగర్థాలే పార్వతీ పరమేశ్వరులు. అంచేతనే వారు ప్రత్యక్షంగానే మనకారాధనీయులని బోధ పడుతున్నది.
పార్వతీ పరమేశ్వరులు వాగర్థాలని చెప్పినప్పుడు వాగర్థాల లాగే వారొకరితో ఒకరు అవినాభావంగా ఉంటారని కూడా అర్థం చేసుకోవచ్చు. వాక్కూ అర్థమూ అలాగే కదా ఉన్నాయిప్పుడు. అవి రెండూ వాచ్య వాచక రూపంగా ఒకదానితో
Page 60