అద్వైతుల సాధన. భగవత్పాదులే అంటారొకచోట. యద్యత్కర్మ కరోమి తత్త దఖిలం శంభో తవారాధనమ్మని. మనో వాక్కాయాలతో ప్రతి క్షణమూ మనమే ఒకపని చేస్తున్నా అదంతా ఈశ్వర స్వరూపమేనని దృఢంగా భావిస్తే చాలు వేరే సాధన అక్కరలేదు. ఆ భావనే సాధన. సరిగా భగవత్పాదుల వాణే ప్రతిధ్వనిస్తున్నది మన కన్నమయ్య వాక్కులలో. శ్రుతి స్మృతి పురాణేతిహాసా దీనాం ఏకవాక్యతా అని భాష్యకారులు ఘోషిస్తారు. సరిగా అలాంటి ఏక సూత్రాన్నే పట్టుకొన్న ప్రజ్ఞాశాలి అన్నమయ్య. వేదవేదాంగాది సమస్త విద్యలూ అన్నమయ్య చేతిలో అపరంజి లాగా కరగిపోయి చిత్ర విచిత్ర రూపాలలో మరలా మూర్తి కట్టి కనిపిస్తాయి. ఏ కీర్తన చూచినా ఏ కీర్తనలో ఏ చరణం చూచినా ఏ చరణంలో ఏ పలుకుబడి తిలకించినా అది ఏ ఉపనిషద్వాక్యమో ఏ సూత్ర పంక్తినో ఏ గీతా శ్లోకాన్నో ఏ యోగ వాసిష్ఠ సందేశాన్నో మనస్మరణకు తెస్తూనే ఉంటుంది. ఒక్కొక్క చోట యథా తథంగానే అనువాదం చేసిన కీర్తనలు కూడా కనిపిస్తాయి. అన్ని చేతలును బ్రహ్మార్పణ విధినేయ అరి మిత్ర సమ బుద్ధి యనన్య భక్తియు ధర నధ్యాత్మ జ్ఞాన తత్త్వం దెలియుట ఇలాంటివి కుప్పతెప్పలు.
అన్నమయ్య సాధన మార్గం కోస ముపదేశించిన అధ్యాత్మ గుణ సంపత్తి కూడా క్రొత్తది గాదు. అద్వైతులు సమదర్శనమే అది. వైష్ణవులు శరణాగతి శరణాగతి అనటం పరిపాటి. అన్నమయ్య కూడా అసకపోలేడామాట. అయితే ఆయన శరణాగతి కర్థం వేరు. అది జ్ఞానవాన్ మాంప్రపద్యతే అని భగవానుడు సెలవిచ్చిన జ్ఞానపూర్వకమైన ప్రపత్తి. జ్ఞానమంటే ఏమిటి. గీతే చెబుతున్నది. వాసుదేవ స్సర్వమితి. విశ్వమంతా వాసుదేవ మయంగా భావించటమే జ్ఞానం. ఈ అఖండ భావనే శరణాగతి గాని అడియేన్ దాసన్ అని ఎవరి పాదాలనో పట్టుకోవటం కాదు. దీనికే సమదర్శన మని పేరు. పండితా స్సమదర్శినః అని గీత. అద్వైతుల ఈ సమదర్శన సిద్ధాంతం అన్నమయ్య నరనరాలలో ప్రవేశించింది. దైవమొక్కడే సంతత భజనీయుడు - భావము సమ బుద్ధి బాయక తగదు. హరియే సకలాంతరాత్మకు డటుగాన - తిరమై యొకరి నిందింప దగదు. అరయగ లోకము లనిత్య మటుగాన మరిగి కొందరి మీద మమతయు వలదు. ఇలా సమదర్శనాన్ని చాటిన సంకీర్తన లెన్నో ఉన్నాయి. ఇట్టి సమదృష్టి అలవడాలంటే అది వట్టి మూఢ భక్తితో రాదు. దీపంలాగ జ్ఞానం దానికి దారి చూపాలంటాడు అన్నమయ్య. దీపమైన హరి భక్తి దెలిసి ఇంతటనైన గాపాడి
Page 58