ప్రస్తుతమా పంచభ్రమలేమిటో చూతాము. భ్రమః పంచవిధో భాతి. ఐదు భ్రమలున్నాయి మానవులకు. స ఏ వేహ సముచ్యతే. అవే మేమిక్కడ సంగ్రహించి చెబుతున్నాము. జీవేశ్వరౌ భిన్న రూపావితి ప్రాధమికో భ్రమః జీవుడూ ఈశ్వరుడూ అని రెండు తత్త్వాలున్నాయి. ఒకటి మన కనుభవసిద్ధం. మరొకటి మన అనుభవంలో లేనిది. లేకున్నా ఉన్నదనే విశ్వసించి తీరాలి మనం. అది మూఢవిశ్వాసం కావచ్చు కదా అంటే కాదు. ఎంచేతనంటే ఎంతో పరిమితమైన జ్ఞానమూ శక్తి కలవాడీ జీవుడు. వీడిచుట్టూ పరిచినట్టెంతో విశాలంగా వ్యాపించి ఉన్నదీ ప్రపంచం. ఈ రెండూ ఎలా సృష్టి అయినాయి. జడమైన జగత్తూ చేయలేదు. అల్పజ్ఞుడైన జీవుడూ చేయలేడు. కాబట్టి వీటి అస్తిత్వం కోసమైనా ఒక ఈశ్వరుడనే తత్త్వాన్ని మనమొప్పుకొనక తప్పదు. వాడు జగత్తులాగే అచేతనుడు కారాదు. అలాగని జీవుడిలాగా అల్పజ్ఞుడూ కారాదు. సర్వజ్ఞుడై ఉండాలి. అలాంటప్పుడల్పజ్ఞుడైన జీవుడూ సర్వజ్ఞుడైన ఈశ్వరుడూ ఒకటెలా అవుతారు. ఇద్దరూ భిన్న రూపులే కావలసి ఉంటుందని మనకు కలిగే మొట్ట మొదటి భ్రమ.
దీనికి పరిహారం చెబుతున్నదుపనిషత్తు. బింబ ప్రతిబింబ దర్శనేన భేద భ్రమో నివృత్తః. బింబ ప్రతిబింబ దృష్టాంతం మనసుకు తెచ్చుకొంటే జీవేశ్వర భేదం తొలగిపోతుందట. బింబ ప్రతిబింబాలేమిటో మనకందరికీ తెలుసు. అద్దంలో మన నీడ కన్పిస్తున్నది. మనం బింబమైతే అది ప్రతిబింబం. ఇప్పుడీ ప్రతిబింబమనేది ఉందా లేదా. కనిపిస్తున్నా నిజంగా లేదది. అది మన శరీరం కంటే భిన్నంగా ఎక్కడ ఉంది. వాస్తవానికి అక్కడ ఉన్నది మన శరీరమే. అదే అద్దమనే ఉపాధి మూలంగా అలా భాసిస్తున్నది. అలాగే ఈశ్వరతత్త్వమే ఉన్నది వాస్తవానికి. జీవుడనే మరొక పదార్థం లేదు. అది అద్దంలో ప్రతిబింబం లాంటిది. శరీర మనఃప్రాణాదులనే ఉపాధుల సంపర్కం మూలంగా ఈశ్వరుడే అనేక జీవరూపాలుగా భాసిస్తున్నాడు. ఇది వట్టి ఆభాసేనని గ్రహిస్తే చాలు. బింబ ప్రతిబింబాలకు భేదం లేనట్టే జీవేశ్వరులకు కూడా భేదం లేదని తేట పడుతుంది.
ఆత్మనిష్ఠం కర్తృగుణం వాస్తవం వా ద్వితీయకః. ఇది రెండవ భ్రమ. కర్తృత్వమనే గుణం జీవుడికి సహజంగా లేదు. నిజంలో అతడు నిస్సంగుడు. కేవలం శరీరాద్యుపాధుల మూలంగానే కర్తృత్వ భోక్తృత్వాలనే గుణాలు నిర్గుణుడైన జీవుడి
Page 242