బోధ అనేదెపుడూ మానవుడి కొక సమస్య అనేది ఉంటేనే జరుగుతుంది. మానవులందరికీ ఉన్న సమస్య ఒక్కటే. అది అనాది సిద్ధమైన అవిద్య లేదా భ్రమ. భ్రమ అంటే ఉన్నదొకటైతే దాన్ని మరొకలాగా భావించటం. ఇలాంటి భ్రాంతి వల్లనే మనకీ సంసారబాధలన్నీ వచ్చి నెత్తినపడ్డాయి.
కాబట్టి బాధలన్నీ తొలగిపోవాలంటే మానవుడీ భ్రమ అనేదాన్ని తొలగించుకోవాలి. ఈ భ్రమ ఒకటి కాదు. ఆలోచిస్తే ఇది ఐదు శాఖలుగా గోచరిస్తుంది. ఐదు తలకాయల శిఖండి ఇది. ఈ ఐదింటినీ రూపుమాపాలంటే ఐదు ఉపాయాలున్నాయి. ఆ ఐదు భ్రమ లేమిటో వాటిని పోగొట్టుకొనే ఈ ఉపాయాలేమిటో నీకు బోధ చేస్తాను సావధానంగా వినమన్నాడు ఋభుడు.
ఋభుడు చేశాడనే నెపంతో నిజానికి మనకు బోధిస్తున్న దుపనిషత్తే. ఋభునిదాఘ సంవాదమనేది ఒక అర్థవాదం. పరమార్థాన్ని మానవులకు బోధ చేయటానికి శాస్త్రం కొన్ని కథలనూ పాత్రలనూ ఆలంబనంగా చేసుకుంటుంది. ఈ ఆలంబనాలకే అర్ధవాదాలని పేరు. దీని ద్వారా మనబోటి మానవులకున్న సమస్య ఏమిటో - అది ఎన్ని విధాలో - వాటి నేయే పద్ధతులలో మనం పరిష్కరించుకోవాలో సలహా ఇవ్వటమే ఇప్పుడుపనిషత్తు చేసే పని.
పోతే ఈ సలహా ఇవ్వటంలో కూడా ఈ ఉపనిషత్తు దీర్ఘమైన చర్చలూ హేతువాదాలూ పెంచుతూ పోలేదు. నలుగురికీ అందుబాటులో ఉండే చక్కని దృష్టాంతాల ద్వారానే అన్ని సమస్యలకూ పరిష్కారాలు సూచిస్తుంది. దృష్టాచ్చ అదృష్ట సిద్ధిః అన్నారు శంకర భగవత్పాదులు. కనిపించిన దాన్ని బట్టే కనిపించని రహస్యాన్ని మనమెప్పుడూ భేదించవలసి ఉంది. లేకుంటే రెండూ మనకతీతమై ఎప్పటికీ మనకది దుర్భేద్యంగానే ఉండి పోతుంది. అంచేతనే శాస్త్రంలో ఎన్ని వాదోపవాదాలు సాగించినా చివరకు హేతువుతో పాటు దృష్టాంతాన్ని అవశ్యంగా ఇవ్వవలసి వచ్చింది. ఇలాంటి దృష్టాంత బలంతోనే సాగుతున్నదిపుడీ ఉపనిషద్బోధ అంతా. ఐదు భ్రమలేమిటో చెప్పి ఐదింటినీ తొలగించుకోవటానికి క్రమంగా ఐదు ప్రసిద్ధమైన దృష్టాంతాలిస్తుంది ఉపనిషత్తు. ఈ ఐదు దృష్టాంతాలనూ వాటి దార్షాంతికాలతో సమన్వయించి చక్కగా మననం చేసిన సాధకుడి కవశ్యంగా నిదిధ్యాసన సిద్ధిస్తుందనటంలో సందేహం లేదు.
Page 241