అజ్ఞాత వాసం చేసినట్టే ఇక్కడా అజ్ఞాత వాసం చేసారు. అక్కడ ద్రౌపదిని సభాముఖంగా పరాభవించటానికి దుర్యోధనుడు యత్నించినట్టే ఇక్కడ కీచకుడు విరాటుని కొలువు వారందరూ చూస్తుండగానే ఆవిడను పట్టటానికి సాహసించాడు. వాడి ప్రయత్నం దైవశక్తి చేత విఫలమైనట్టే వీడి యత్నమూ దైవంవల్లనే వమ్మయి పోయింది. ముఖ్యంగా ద్రౌపది మూలాన్నే అక్కడా ఇక్కాడా కూడా ముప్పు సంభవించింది పాండవులకు. ప్రతిజ్ఞా రూపంగానైనా భీముడే అక్కడ ఆదుకోవలసి వచ్చింది. ఇక్కడ ఆదుకోవటమే గాక అంతుకూడా చూడవలసి వచ్చింది. ఇలాగా ఆది సభా పర్వాల కథాభాగమంతా ఈ పర్వంలో అద్దంలోలాగా కనిపిస్తుంది. అలాగే అరణ్య పర్వ వృత్తాంతం కూడా చమత్కారంగా ప్రతిఫలించింది. అరణ్యపర్వంలో మృగాలను వేటాడటం, భీముడు రాక్షసులను ఉక్కడంచటం, అర్జునుడు స్వర్గానికి వెళ్ళి వినోదించటం, ధర్మజుడు మార్కండేయాదులతో సట్గోష్టి సలపటం, ఇవి ప్రధానాంశాలు. ఇవన్నీ మరలా మనకీ పర్వంలో దర్శనమిస్తాయి. మృగాల నిక్కడా భీముడు వినోదార్థం పట్టి వధిస్తాడు. రాక్షసులలంటి మల్లులతో పోరాడి ఎందరినో మట్టుపెడతాడు. మరి అర్జునుడైతే స్వర్గంలో అప్సరో సృత్తాలను తిలకించినట్టే నర్తనశాలలో పడుచుకన్యలకు ఆట పాటలు నేర్పుతూ కాలం గడుపుతాడు. పోతే సన్యాసి వేషంలో ధర్మరాజు విరటుడితో ఎప్పుడూ సుభాషిత గోష్టితోనే కాలక్షేపం చేస్తుంటాడు.
ఇలా పూర్వ కథా భాగాన్నంతా మరలా మన స్ఫురణకు తెస్తుందీ పర్వం. అంతేకాదు పూర్వభాగాన్ని స్ఫురింప జేసినట్టే రాబోయే కథా వస్తువునంతా టూకీగా సూచించటం కూడా చూడవచ్చు మనం. అదెలాగంటే గోగ్రహణం జరిగింది విరాట పర్వంలో, అది చేసింది దుర్యోధనాదులు. దుర్యోధనుడు చేసిన గోగ్రహణ భూగ్రహణమే. గోవంటే భూమి అని కూడా అర్థమే. పాండవులకొక అంగుళంకూడా స్థలం పంచి ఇవ్వక మొత్తం భూమి అంతా నాదేనని పంతగించటమే అతడు చేసిన గోగ్రహణం. అయితే పాండవులూరక చూస్తూ కూచో లేదు. ఎలాగైనా విడిపించాలి దాన్ని. దానికి యుద్ధమే శరణ్యం. అందులో అర్జునుడి వల్లనే విజయం చేకూరాలి. రాబోయే యుద్ధ పర్వాలలో మనం చూడబోయే విషయమిదే. అందుకోసం నలుగురూ సమావేశం కావటమూ, ఏమిచేయాలా అని చర్చించటమూ, ఉద్యోగపర్వంలో చూచే విషయం. సరిగా ఈ విషయాలు రెండు చక్కగా దాఖలా అవుతాయి విరాటంలో.
Page 228