పరవస్తు చిన్నయ సూరి - రచనా శిల్పం
తెలుగుదేశంలో పరవస్తు చిన్నయ సూరి పేరు తెలియని పాఠకులు లేరు. అలాగే ఆయనను గూర్చి పూర్తిగా తెలిసినవారూ లేరు. చిన్నయ సూరి అనగానే ముందుగా మనకాయన బాలవ్యాకరణం మనసుకు వస్తుంది. ఆ తరువాత ఆయన మిత్రలాభ మిత్రభేదాలూ అందులో ఆయన వ్రాసిన కొన్ని కాకీ పిట్ట కథలూ జ్ఞప్తికి వస్తాయి. అంత వరకూ తెలుగు చదివిన విద్యార్థులందరికీ ఆయన పేరు బాగా పరిచితమే. అయితే ఆయన రచన ఎలాంటిది అందులో ఆయన చూపిన చాతుర్యమూ చమత్కారమూ ఎలాంటిదని అర్ధం చేసుకొన్న పాఠకుడు మాత్రం నూటికొకడుంటాడో లేడో చెప్పలేము.
సూరి రచించింది చాలా వరకు వచనమే అయినా, అది కూడా చాలా స్వల్పమే అయినా, ఆ స్వల్పమైన పరిధిలోనే అనల్పమైన శిల్పాన్ని ప్రదర్శించాడా మహానుభావుడు. ఆ రచనా శిల్పాన్ని గూర్చి ప్రస్తుతం కొంత స్థాలీ పులాక న్యాయంగా పరిశీలించి చూతాము.
రచనను గురించి ప్రసంగించట మంటే ఒకవిధంగా కావ్యం మొత్తాన్ని విమర్శించటమే. కావ్యమంతా రచనే గదా. రచన అనేది అందరూ చేస్తారు గాని అలా చేసే వారిలో బాగా మెరుగులు దిద్దేవాడూ, చక్కని మెలకువలు చూపేవాడూ, చాలా అరుదుగా కనిపిస్తాడు. ఎన్నో కట్టడాలు చూస్తుంటాము లోకంలో. కాని ఒక తాజమహలు లాంటి కట్టడాన్ని చూచినప్పుడే మనిపిస్తుంది మనకు. ఆహా ఏమి ఈ నిర్మాణం. ఇది నిర్మంచిన శిల్పి ఎంత గొప్పవాడో గదా అని ఆశ్చర్యపడతాము. అలాంటిదే కావ్య నిర్మాణం కూడా. చిన్నయ సూరి కావ్యమొక తాజ్మహలు లాంటి అపూర్వమైన రచన. కథా కథనం మొదలుకొని అక్షర విన్యాసం వరకు ఎన్నో అద్భుతమైన పోకడలు పోయిన రచన అది.
ఆయన తీసుకొన్న కథలు భారత భాగవతాదుల వంటి గొప్ప కథలు గావు. లేదా కావ్యనాటకాదుల వంటి అద్భుతమైన సన్నివేశాలూ కావు. పిల్లులూ, ఎలుకలూ, నక్కలూ, జింకలూ, సింహాలు, ఎద్దులూ ఇలాటి పశుపక్ష్యాదుల కథలే చాలావరకు. పోతే మనబోటి మానవుల చరిత్రలూ కొన్ని ఉన్నాయి అక్కడక్కడ. కాని ఎంత
Page 215