వైరుధ్యం. వైరుధ్యం కాదిది. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క జీవిత సత్యాన్ని బోధించటానికి పురాణ ఋషి చేస్తూ వచ్చిన ఒక కల్పనా శిల్పం.
ఇంతెందుకు. శివపురాణాలు విష్ణువును తక్కువ చేసి చూపితే విష్ణుపురాణాలు శివుణ్ణి కించపరిచి వర్ణిస్తాయి. ఇద్దరినీ తక్కువ చేసి వర్ణిస్తుంది దేవీ పురాణం. ఏమిటీ విడ్డూరం. బాహ్యానికి విడ్డూరమే. కాని ఆంతర్యమిది కాదు మహర్షికి. అన్యనిందా అన్యస్తుతయే అన్నారు పెద్దలు. ఒక దేవత నాక్షేపించిందంటే ఆక్షేపించటం కాదు. తాత్పర్యం. అనేక దేవతల మీద ప్రాకులాడకుండా ఒకే దేవతామూర్తి మీద మనసు నిలపమని ఉపదేశించటం. చివర కిందరు దేవతలు లేరు అన్ని కలిసి సర్వవ్యాపకమైన ఒకే ఒక పరమాత్మ తత్త్వమనే రహస్యాన్ని మనకు గుర్తుచేయటం కూడా,
ఇలాటి సవిమర్శ దృష్టితో చూచినప్పుడే సమన్వయ మవుతాయి పురాణాలు మనకు. లేకుంటే ఒక స్తంభాన్ని చీల్చుకొని హఠాత్తుగా ఒక సింహం బయటకి రావటమేమిటా ఒక ఏనుగు మొరపెడితే ఎక్కడి నుంచో హడావుడిగా దేవుడు పరుగెత్తి రావటమేమిటా అని దిక్కులు చూడవలసి వస్తుంది మనం. అవన్నీ దేవుడు సర్వవ్యాపకుడని చెప్పటానికీ త్రికరణ శుద్ధిగా ఆశ్రయిస్తే మనలనాదుకొని మనకీ సంసార తాపం పాపగలడని చెప్పటానికే మహర్షి అవలంబించిన సంకేతాలని గ్రహిస్తే చాలు. సమస్యలేదిక. ఇంతెందుకు. త్రిగుణాత్మక మీ సృష్టి అని చెప్పటానికే దేవదానవాదుల కథలన్నీ. మరి వారి కష్టసుఖాలన్ని వర్ణించట మీ త్రిగుణాలలో ఉన్నంత వరకూ సుఖంలేదు గుణాతీతమైన సత్యాన్ని పట్టుకొని తరించమని మానవుడికి చాటి చెప్పటానికే. ఇదే పురాణాలన్నింటికున్న ఏకైక సంకేతం. దీన్ని దృష్టిలో పెట్టుకొని చదువుతూ పోవాలి పాఠకుడు. అప్పుడే వాల్మీకి వ్యాసాదులు పురాణ వాఙ్మయ మెందుకు సృష్టించారో దాని హృదయమేమిటో పదహారు కళలతో ప్రత్యక్షమయి సంతృప్తి నిస్తుంది భావుకుడికి. లేకుంటే అంతా గందరగోళమే.
Page 214