పురాణాలు - వాటి సంకేతం
పురాపి నవమేవేతి పురాణం. అతిప్రాచీనమైనా ఎప్పటికీ నవీనంగా కనిపించేదేదో అదే పురాణం. ప్రాచీనమైన నవీనమెలా అయిందది. ప్రాచీనమది బోధించే సత్యం నవీన మది అనుసరించే విధానం. సత్యమనేది మనం సృష్టించేది కాదు. మనం గుర్తించినా గుర్తించకున్నా ఎప్పుడూ ఉందది. మనకూ ఈ ప్రపంచానికి కూడా ఆధారభూతం. అదే మన స్వరూపం. అయితే దాన్ని మరచిపోయాడీ మానవుడు. మరచిపోయిన ఆ సత్యాన్ని మరలా మనకు జ్ఞాపకం చేస్తున్నది పురాణం. కాబట్టి సత్యనిరూపణ దృష్ట్యా అది ప్రాచీనం.
పోతే నవీన మేమిటిక. నిరూపించే సత్యం ప్రాచీనమైనా దాని నావిష్కరించే మార్గం సరిక్రొత్తది. శాస్త్రంలాగా సత్యాన్ని సూటిగా చెప్పదు పురాణం. కథలనూ పాత్రలనూ చాటుచేసుకొని బోధిస్తుంది. ఇప్పుడీ కథలనండి, పాత్రలనండి, ఇవన్నీ సత్యం కావు. సత్యాన్ని మనకందించే సంకేతాలు మాత్రమే. అలా అందజేయాలనే దృష్టితోనే అష్టాదశ పురాణాలు సృష్టించాడు వేదవ్యాసుడు. ఉప పురాణాలు కూడా రచించాడు. వీటిలో ఎన్నో కథలు, పాత్రలు వారి జీవితాలు. వారిలో దేవతలున్నారు, మానవులున్నారు, దానవులున్నారు. పశుపక్ష్యాదులు కూడా ఉన్నాయి. ఇంత చిలవలు పలవలు పెట్టి వర్ణించినా ఇవన్నీ కల్పనలే. సంకేతాలే. ఈ సంకేతాల ద్వారా భావుకుడందు కోవలసింది చివరకా ఏకైకమైన పరమార్థమే. అసతో మా సద్గమయ.
కనుకనే పురాణాలను పరిశీలించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి పాఠకుడు. బాహ్యమైన కథలూ వర్ణనలూ చూచి అవే సత్యమని అక్కడికే ఆగిపోరాదు. సత్యానికది సూచకమని భావించి ముందుకు సాగిపోవాలి. కథలే సత్యమనుకొంటే ఒక ప్రమాదం కూడా. ఒకే కథ ఒక పురాణంలో ఒకలా నడిస్తే మరొక పురాణంలో మరోలా నడుస్తుంది. త్రిపురాసుర వృత్తాంతంలో ఒకచోట శివుడు బేల అయి విష్ణువు నాశ్రయిస్తాడు. మరొకచోట విష్ణువు బాణమయి శివుణ్ణి ఆశ్రయిస్తాడు. హరిశ్చంద్రుడొక పురాణంలో అబద్ధాలకోరు. మరొక పురాణంలో సత్యసంధుడు. నారదుడు మహాజ్ఞాని అని ఒక పురాణం చెబితే పరమపామరుడని చాటుతుంది ఇంకొక పురాణం. ఏమిటీ
Page 213