#


Index

చిత్రతరంగిణి

ఘట్టం. మన ఇండ్లలో ఇద్దరు బాగా చదువూ సంస్కారమున్న పెద్దలు ఒకరితో ఒకరు ఛలోక్తులాడుతూ క్రీడిస్తుంటే నలుగురు నిలబడి ఎంతో సరదాగా చూస్తూ ఆనందిస్తున్న సన్నివేశాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. మేళవించినవి సుమ్మీ దీని మెట్లని, మహతి అనే వీణ భుజం మీద పెట్టాడు. మిన్నేటి జలము సుమ్మీ తొలంకెడు నని కమండలు వొక చేతికిచ్చాడు. ఇది జపోచితమని చెప్పి మరొకచేతిలో రుద్రాక్ష పెట్టాడు. ఇది మాకు ఈశానుడిచ్చాడు జాగ్రత్త అని చెప్పి చంకలో శార్దూల చర్మం జొనిపాడు.

  ఇలా అన్నివిధాలా బిగించి ఇక అతణ్ణి ముందుకు నడవమంటే ఎలా నడుస్తాడాయన. అయినా పొమ్ము పొమ్మనగానే ఒక కొంత పోవనే పోయాడట. రమ్ము రమ్మని పిలవగానే చేర వచ్చాడట. ఏమిటిదంతా. కపటనటనా పరుండైన కంసవైరి బరమముని నవ్వుటాలకు బనులు గొనియెనని అసలు సంగతి బయట పెడతాడు కవి. నారదుడాయన చేత పనులు చేయించుకోటమూ నటనే. కృష్ణుడాయన చెబితే చేయటమూ నటనే. అంతా నవ్వులాటలేనట. కాదా మరి. ఒకడు నిత్యముక్తుడు. మరొకడు జీవన్ముక్తుడు. ఇద్దరి మధ్యా జరిగేది నటన కాకుంటే యథార్థమా. ఇంతకూ కేవల మానవోచితమైన వ్యవహారం మొదలుకొని మానవాతీతమైన వ్యవహారం వరకూ ఆయా పాత్రలను నెపంగా పెట్టుకొని ఒక లోకోత్తరమైన సృష్టి చేశాడు మహాకవి. ఒకదాని నభిమానిస్తే మన భావాలకు మనమే దాసులం. అలాకాక అందరు మనలాటి వారే గదా అని చూస్తే సమరస భావంతో శాంతి సుఖాలకు నోచుకుంటాము. అదీ దాటి విశ్వాతిగమైన దృష్టితో చూడగలిగితే అంతా మన స్వరూపమేననే అద్వైత సుఖానుభూతినే అందుకోగలం. అదే పరిపూర్ణత మానవ జీవితానికని మూడు భూమికలలో మనకొక అద్భుతమైన సందేశమందిస్తున్నాడు. నంది తిమ్మన. అది అందుకొంటే మనపాలిటికది పారిజాతాపహరణమే కాదు. పారిజా తాపహరణం. దాని పరిమళం తాపత్రయాన్ని అపహరించి సర్వత్ర అదే మనకు ఆత్మస్వరూపంగా దర్శనమివ్వగలదు.

Page 212

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు