చింతా రత్న పీఠం మీద నిలుపుకొంటుంది. నేడు రేపు నీ వనితయు నీవు నిచ్చట నవశ్యము మజ్జన భోజనాది పూజనములు గైకొన వలయునంటుంది. సరేనని ఆమెకు మ్రొక్కి సోదరుడైన ఇంద్రుడి మొగం చూస్తాడట కృష్ణుడు. వెంటనే అతడు వినయానతుడై విడిదిపట్టు మనవైజయంతమే చిత్తగించమంటాడు. వల్లేయని మందహాసం చేస్తూ కయిదండ గొంటూ ముందుకు నడుస్తాడు కృష్ణుడు. ఎలాంటి సౌభ్రాత్రమో చూడండి.
ఇక అత్తా కోడండ్ర ఒద్దిక ఇంతకన్నా గొప్పది. అదితి చింతామణి వేదిక మీద కల్పకుసుమ తల్పం మీద పవ్వళించి ఉంటే ఇంద్రుని రాణి పాలోమి ఒయ్యన అడుగులొత్తుతుంటే దిక్పాలకుల సతులంతా వీటికా కరండ వీజనాలతో సేవిస్తారట. అసలు సత్యభామే కృష్ణుడితో మొరబెడుతూ ఒక మాట అంటుంది. తనదు కోడండ్రలోన పెద్దయుగ నన్ను దేవకీ దేవి మన్నించు, ఆ సాధ్వి సేయ సేయబోవంగ నాకింక సిగ్గుగాదె అని. అంత రాజసమున్న కోడలే అత్తమీద ఇంత గొప్ప భావం వెల్లడించిందంటే ఇక మిగతావారి మాట చెప్పేదేముంది.
పోతే ఒక గృహస్థుడు తన దైనందిన జీవితంలో పిల్లాపాపలతో బంధుమిత్రాదులతో ఎంత ఆలజాలంగా కాలం గడపాలో గూడా ధ్వనింపజేస్తాడీ మహాకవి. నారదుడు శ్రీకృష్ణుడి కెప్పుడూ ఒక విడరాని చుట్టమే. ద్వారక వైకుంఠపురం బీ రుక్మిణి లక్ష్మిమీర లిచ్చట నునికిన్ సారెకు గొల్వగ వత్తుం గోరికతో నని తన రాకకు సంజాయిషీ చెప్పుకొంటాడు. కృష్ణుడి కాంతల దగ్గర కూడా ఆయనకెంతో చనువు. ఆయనగారి ఆధ్వర్యంలోనే అసలా పరమాత్మ పెండ్లిండ్లన్నీ. ఆయన కను సన్నలతోనే రుక్మిణి కాయన పారిజాత మివ్వటం. సత్యభామకు కోపం ప్రజ్వలింప జేసి కూడా మరలా అది చల్లారగానే ఆవిడ ఇంటికి భోజనానికి తయారు. అతనికి సత్యభామయు మురాసురవైరియు నాతిథేయ సత్కృతు లొనరిస్తారట. ఇంతలో పళ్లేరంబు వెట్టితిమని సఖులు నివేదించగానే ఆ ముని పతి ముందు నడుస్తుంటే ఆయన వెనకాలే దంపతులు బయలుదేరి వెళ్లుతారట.
ఇక అక్కడ భోజనశాలలో అంతా వచ్చి ఆసీనులవుతారు. ఎవరు. వీరు ముగ్గరే కాదు. వీరితోపాటు సాంబాదులైన కుమారులూ, సాత్యకి మొదలైన సోదరులూ
Page 210