సవతులూ పరివేష్టించి రాగా ఎంతో రాజసంతోనే బయలుదేరింది. కృతక వికాస మచ్చుపడ అంటాడు కవి. సాక్షా లక్ష్మి అయినా భూలోక వాసన పోలేదని కాబోలు కవి సూచన.
పోతే సత్యభామ తీరువేరు. ఆవిడది ఉరక బయటపడే స్వభావం. సవతుల పోరావిడికు పనికిరాదు. వల్లభుడెప్పుడూ తనకే వశమయి ఉండాలి. అలా వశమయినట్టే నటిస్తాడా కొంటె కృష్ణుడు. ఎట్టి కామినులకు గారవంబు మెరమెచ్చులకై పచరింతుగాని పాయని యనురక్తి నీ యెడనె యగ్గలమై కనుపట్టు, నాకు నీ పని చినపంపు సేయుటయ ప్రాభవమని ఇచ్చకాలాడి ఆవిడ మనసుకు నచ్చ చెబుతుంటాడు. అవన్నీ పచ్చి మోసాలని ఎప్పుడైనా బయట పడిందో ఆవిడ తిట్లకేగాక తన్నులకు కూడా సిద్ధం కావలసిందే. అయితే చిత్రమేమంటే అన్నింటికీ తట్టుకొని అలాంటి గయ్యాళి భార్య అభిమానాన్ని కూడా చూరగొని చివరకు దిగ్విజయం సాధించటం నిజంగా దాంపత్య జీవనానికే దిగ్విజయం. కనుకనే భోజకన్యా సరి ద్రాజ హంసము, సత్యభామా శుకీ కేలీ పంజరంబు అని ఆదిలో ఎలాంటి దాంపత్య సుఖాన్ని అనుభవించాడో కృష్ణుడంతంలో కూడా మరలా అలాటి సుఖాన్నే చూరగొనగలిగాడు. మధ్య మధ్య సంసార జీవితంలో ఎన్నైనా పొరపొచ్చాలు రావచ్చు. కాని అవన్నీ మధ్యలోనే మాసిపోవాలని కవి మనకు చేసే సూచన.
సంసారమంటే ఒక దాంపత్యమే గాదు. గృహస్థాశ్రమంలో అన్ని సంబంధాలు కలిస్తేనే అది సంసారం. తల్లీకొడుకుల మధ్య ఎలాంటి అభిమానముండాలో, అత్తాకోడండ్ల కెలాంటి ఐకమత్యముండాలో, అన్నదమ్ముల సయోధ్య ఎలాంటిదో చివరకు బంధుమిత్రాదుల అనుబంధమెలాంటిదో ఇవన్నీ కూడా ఎంతో చమత్కారంగా లోకానికి ధ్వనింప జేశాడు నంది తిమ్మన.
అదితిదేవి ఇంద్రుడికే గాక ఉపేంద్రుడైన కృష్ణుడికి కూడా తల్లే. ఆ ముసలావిడ కుండలాలు బలవంతంగా లాక్కొని పోయాడు నరకాసురుడు. అవి మరలా ఆ తల్లికి చేర్చే వరకూ నిద్ర పట్టలేదు కృష్ణుడికి. ఇంద్రుడు నన్నడగటానికి దూతనెందుకు పంపలేదో విచారించమని నారదునితో చెప్పి పంపుతాడు. స్వర్గంలో ఆవిడను దర్శించగానే సత్యారమణీ యుతంబుగా నమస్కారం చేస్తాడు. ఆవిడ దీవిస్తూ చెంగట
Page 209