#


Index

చిత్రతరంగిణి

  ఇలా చెబుతూ పోతే ఎంతైనా ఉంది. ఇంతెందుకు. ఆలంకారికులు చెప్పిన కావ్య సామాగ్రి అంతా ఇతినిలో దర్శనమిస్తుంది. ప్రసాద మాధుర్యాది గుణాలైతే నేమి, వైదర్భ్యాది రీతులైతే నేమి అన్నిటికి నిలయమిది. తన రచనా వైవిధ్యం ద్వారా తరువాత కవులందరికి మార్గదర్శకుడయ్యాడు. సీసపద్యం వ్రాయటమెలాగో శ్రీనాధుడితణ్ణి చూచి నేర్చుకొన్నాడు. సంస్కృతాంధ్ర పద సమ్మేళన మెలా చేయాలో పెద్దన గ్రహించాడు. తీగ సాగినట్ట పద్యమెలా నడపాలో భట్టుమూర్తి అలవరుచుకొన్నాడు. అచ్చ తెలుగులో ఎలా వ్రాయలో కొందరు గ్రహించారు. తుదకు నిరోష్ట్యాదికంగా వ్రాయటం కూడా కొందరభ్యసించారు.

  అంతేకాదు. పద్యమెంత దర్జాగా నడుస్తుందో గద్యం కూడ అంత హుందాగా నడవటమనేది కూడ ప్రబంధ కవులందరూ ఇతని దగ్గరే అభ్యసించారు. అందరూ అలా ఉంచి పోతనలాంటి మహానుభావుడే కొన్ని కొన్ని సందర్భాలలో ఈ మహాకవి శైలి ననుకరించే చాపల్యం చూపుతూ వచ్చాడంటే ఇక చెప్పేదేముంది. ఇందుండు హరుమౌలి నిందుండు, ఇచ్చట వసియింప నిచ్చట. ఇలాటి సభంగ శ్లేషలతో రచన చేయటం సాహిత్య రసజ్ఞుడనని గొప్పలు చెప్పుకొన్న రామరాజ భూషణుడే శుశ్రూష చేసి శిక్షణ పొందవలసి వచ్చిందంటే ఏమనుకోవాలి మనం. ఇలాటి సార్వపధీనమైన కావ్య రచనా శిల్ప కౌశలం మన ఆంధ్ర మహాకవులలోనే కాదు. గీర్వాణ కవులలో కూడా ఎంతో మందికి లేదంటే మన మాశ్చర్యపడనక్కరలేదు. కనుకనే వారినీ వీరినీ అందరినీ తడవి చూచిన కవి సమ్రాట్టే ఒకడు నాచన సోమన్న అని ఆయనగారికే పట్టాభిషేకం చేయవలసి వచ్చింది ఈ బహుళాంధ్రోక్తి మయ ప్రపంచ మహాసామ్రాజ్యాని కంతటికీ.

Page 198

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు