నాచన సోమనాధుడు
కావ్యం యశసేర్ధకృతే అని కావ్య నిర్మాణానికెన్నో ప్రయోజనాలు చెప్పారు మన ఆలంకారికులు, అన్నీ అలా ఉంచి రెండు మాత్రం చాలా ముఖ్యమైన వున్నాయి మనం చెప్పుకోవలసినవి. సద్యః పర నిర్వృతయే అనేది ఒకటి. కాంతా సమ్మిత తయోపదేశ యుజే అనేదొకటి. చదవగానే అర్థం చేసుకొంటే ఎక్కడలేని అహ్లాద మివ్వాలట. అలా ఇవ్వటమే గాక జీవితానికొక చక్కని పాఠం నేర్పాలట. ఇవి రెండే ఏకళకైనా మన మాసించవలసిన ప్రయోజనాలు. అందులోనూ కళారాజమైన కావ్యాని కవశ్యం భావి అయినవి. ఎందుకివి రెండే అంటున్నామని అడుగుతారెమో. ఇందులో ఒక రహస్యముంది. అదేమంటే సత్యం సుందరమని రెండు మాటలున్నాయి. కావ్యమొక జీవిత సత్యాన్ని చెప్పాలి మొదట. కవి అంటే క్రాంతదర్శి. లోకులందరి బుద్ధి నతిక్రమించి ఒక సత్యాన్ని దర్శిస్తాడు మొదట. అది తన కావ్యానికి వస్తువుగా చేసుకొంటాడు. తరువాత అతడు క్రాంత దర్శిఅవుతాడు. అంటే ఆ సత్యాన్ని ఎంత సుందరంగా మలచిచూపాలో లోకానికంతగా వర్ణించి చూపుతాడు. భావనలో సత్యం, రచనలో సౌందర్యం. ఇవి రెండూ కలసి సాధించే జీవిత లక్ష్యం శివం. అంటే శ్రేయస్సు. దీనికే శివేతరక్షతి అని పేరు. సత్యసుందరాలలో అది గర్భితమయి ఉంటుంది. సత్యసుందరాలెంత స్థాయి కెదిగి ప్రతిపాదిస్తే అంత స్థాయి పెరుగుతూ పోతుంది కవి కావ్యానికి. అతడాసించిన శివమంత ఉదాత్తంగా భాసిస్తుంది. కావ్య జీవితమంతా ఇదే. ఈ త్రివేణీ సంగమంలో స్నానంచేసి తీరం చేరినవాడే మహాకవి శబ్ద వాచ్యుడు.
ఆంధ్ర సాహిత్యంలో ఇలాంటి మహాకవులెందరో లేరు. ఆనందవర్ధనుడు చెప్పినట్టు వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. వారిలో ఒకడు ప్రస్తుతమీ నాచన సోమనాధుడు. తనకు ముందున్న నన్నయ, తిక్కనల గుణాలను పుడికి పుచ్చుకొని తన తరువాత వచ్చిన ప్రబంధ కవులందరికి ఒక్కొక్కరి కొక్కొక్క కవితా గుణాన్ని వంచి పెట్టి వీరికీ వారికీ కూడా అంతుపట్టని మార్గంలో పయనించిన నవీన గుణసనాధుడు. నన్నయలోని కథా కధన దక్షతా, తిక్కనలోని రసాభ్యుదయ బంధతా కొట్టవచ్చినట్టు కనిపిస్తాయి కవిలో. పోతే శబ్దాలంకారాలేమి, అర్థాలంకారాలేమి, అష్టాదశ వర్ణనలేమి, పద్యగద్య
Page 193