ఇది నోటి వరకే. మనసుమీద పని చేయదు దాని ప్రభావం. మనసు ఏ భావమూ లేక స్తబ్దంగానే ఉండిపోతుంది. అయితే ఎంతవరకంటే పిచ్చి పిచ్చి ప్రసంగాలతో కాలం వృథా పుచ్చక దైవప్రార్ధన చేస్తూ పోవటం కొంచెం మేలు. పోతే రెండవది నోటితో అనే దాని భావం మనసులో ప్రవేశించటం. అంటే శబ్దాన్ని దాటి అర్ధం దగ్గరికి వచ్చామన్నమాట. కాని అంతవరకే అది. మనసులో ప్రవేశించినా నిలకడగా ఉండదది. మెరుపులాగా వస్తూపోతూ ఉంటుంది. పోతే మూడవది పరమాత్మ రూపం బాగా మనసులో నాటుకొని కదలకుండా నిలిచి ఉండటం. ఎంతగా నిలుస్తుందంటే మిగతా ప్రాపంచిక విషయాల మీదికి మరలా దాన్ని త్రిప్పాలంటే బలవంతంగానే త్రిప్పాల్సివస్తుంది. రెండవదానికిది కేవలం ప్రతి ద్వంద్వి అయిన భూమిక.
4. పోతే ఇక నాలుగవది ఆఖరిది ఏమంటే మనసులో భగవద్రూపాన్ని గూర్చిన ఆలోచన గాదు. భగవత్తత్వమే నిలిచి ఉండాలి. ప్రపంచమూ - భగవంతుడూ దాన్ని గూర్చిన ఆలోచనా - అన్నీ కలిసి భగవత్ స్వరూపంగానే అనుభవానికి రావాలి సాధకుడికి. అది కూడా తనకు భిన్నంగా కాక తన ఆత్మ స్వరూపంగానే సాక్షాత్కరించాలి. నేనొక ధ్యాతను నాకొక ధ్యేయమైన పదార్థముంది - దాన్ని గూర్చే ధ్యానిస్తున్నాననే భావమే ఉండదప్పుడు. ధ్యాతా నారాయణః ధ్యానం నారాయణః - అన్నట్టు అంతా ఆత్మ స్వరూపమే. ఇదే ధ్యానానికి పరాకాష్ఠ.
Page 186