ధ్యానం
1. మానవుడు నిత్యమూ తన మనసులో స్మరించవలసింది – ధ్యానించవలసింది ఏమిటని ప్రశ్న. కళ్లు మూసినా తెరచినా కనిపించేది మనకీ ప్రపంచమే. కాబట్టి ఇందులో విషయాలే మనసుకు వస్తుంటాయి. వీటిని గూర్చే ఆలోచిస్తుంటాము. అందులోనూ మనకు కొన్ని ఇష్టమైనవైతే కొన్ని ఇష్టం లేనివి. ఇష్టం లేని వాటిని పరిహరిస్తూ ఇష్టమున్న వాటిని గురించే ధ్యానిస్తుంటాము. ఇదే సహజంగా ప్రతి మానవుడు చేస్తున్న పని. పగలంతా మెలకువగా ఉన్నంత వరకూ ఇదే. రాత్రి స్వప్నంలోనే మనమేదీ ఆలోచించనిది. ఆలోచించకున్నా ఈ ఆలోచనల సంస్కారాలే అక్కడా పనిచేస్తూ మనలను వెంటాడుతుంటాయి. మొత్తం మీద ప్రాపంచిక విషయాలతోనే నిండి నిత్యమూ సతమతమవుతూంటాయి మానవుడి మనోవ్యాపారాలన్ని.
2. అయితే ఈ ఆలోచనల వల్ల ఏమైనా సుఖమా శాంతా అని చూస్తే ఏదీ లేదు. లేదని పెద్దలు చెప్పటమే గాదు ఆబాలగోపాలమూ అందరికీ అనుభవసిద్ధమే. శాంతి సౌఖ్యాలకు నోచుకోనప్పుడీ ఆలోచనలెన్నిపెట్టుకొని ఏమి ప్రయోజనం. మానవుడెప్పుడూ కోరుకొనేది అవి రెండే గదా. మరి ఎలా సిద్ధిస్తాయవి. దేనివల్ల సిద్ధిస్తాయి. ప్రాపంచికం వల్ల కాదని ఎప్పుడన్నమో ఇక పారమార్థికం వల్లనే కావాలది. అది ఈ ప్రాపంచిక పదార్థాలనన్నింటినీ వ్యాపించిన ఒక మహాచైతన్యం. నిరాకారమైన దానివల్లనే ఈ ఆకారాలన్నీ ఏర్పడుతున్నాయి. నిశ్చలమైన దాని వల్లనే ఇవన్నీ ఇలా చలిస్తున్నాయి. సర్వవ్యాపకమైన దాని భంగిమలే ఈ పరిమితమైన విశేషాలన్నీ. కాబట్టి దాన్ని గురించే ఎప్పుడూ మనం ధ్యానించవలసింది. ఆత్మ చైతన్యంతో సంబంధమే నిజమైన జీవితం మానివుడికి. అనాత్మ ప్రపంచ సాంగత్యమే మరణం. ఆత్మ ధ్యానంలో ఉన్న మానవుడు మిగతా మానవుల మధ్య మృతకళేబరాల మధ్య ఒక కాటి కాపరిలాగా జీవిస్తుంటాడని వాక్రుచ్చారు పెద్దలు.
3. అయితే ఏమిటీ ఆత్మ ధాన్యమది ఎలా చేయాలని ప్రశ్న. నాలుగు భూమికలున్నా యిందులో. మొదటిది నోటితో ఏదో జపిస్తూ కీర్తిస్తూ కూచోటం.
Page 185