అస్పృశ్యతలోనే ఉంది నిజమైన విలువ. హేయమైన ప్రాపంచిక వాసనలేవీ అంటని అలాంటి విలువైన జీవితం జీవించటం అస్పృశ్యత అని భావిస్తే అంతకన్నా మనం కోరుకోవలసింది మరొకటిలేదు. వాడు భగవత్స్వరూపుడే. ఎందుకంటే నిర్గుణుడైన భగవంతుడే అసలు అస్పృశ్యుడు. అలాటి తత్వాన్ని అందుకొన్న భాగవతుడూ అస్పృశ్యుడు కావటంలో ఆశ్చర్యమేముంది.
దేశాటనము
1. మానవుడికి దేశాటన మనేది చాలా ఆవశ్యకం. జహాన్ దీదా-గోషేనిషీన్. మొదట దేశమంతా తిరిగిరా. తరువాత ఒక చోట కదలకుండా కూచో అన్నారు సూఫీలు. తిరగటమేమిటి? కూచోటమేమిటి? తిరగటం అనుభవం కోసం. కూచోటం దాన్ని నెమరు వేసుకోవటం కోసం. అప్పుడే పరిపూర్ణత జీవితానికి. దేశం తిరగకుండా ఒక చోటనే తిష్టవేసుకొని కూచుంటే జిడ్డుబట్టిపోతాడు మనిషి. విజ్ఞాన వివేకాలకు నోచుకోలేడు. నీరు నిత్యమూ ప్రవహిస్తూ పోవాలిగాని ఒకేచోట నిలిచి ఉంటే పాచి పడుతుంది. వాసన గొడుతుంది. అలాగే మానవుడూ.
2. దేశం తిరగమన్నారు గదా అని గాసుగెద్దులాగా తిరిగితే సుఖం లేదు మరలా. సప్రయోజనంగా ఉండాలి దేశటనమనేది. ఏమిటా ప్రయోజనం. జ్ఞానసముపార్జనమే ప్రయోజనం. ఆదమీ దీదస్త్ - నేపోస్త్ నౌస్తి ఖాన్ అన్నారు. మానవుడంటే ఎముకలూ కండలూ చర్మమూ గాదు. వాడి జ్ఞానమే వాడి స్వరూపం. అది మొదట వాణ్ణి సృష్టించినపుడు చాలా తక్కువ మోతాదులో ఇచ్చి సృష్టించాడా ఈశ్వరుడు. అలాగే ఉండిపోతే లాభంలేదది. పరిమితమైన జ్ఞానాన్ని పరిపూర్ణం చేసుకొని తరించవలసిన బాధ్యత ఉంది మనకు. అందుకోస మేర్పడిందే ఈ ప్రపంచం.
3. ప్రపంచమంతా మనకు చదువుచెప్పటానికే ఉంది. ఇంట్లోనే కూచుంటే చెవిలో పడవు ఆ పాఠాలు మనకు. ఎంతెంత దేశం తిరిగి చూస్తే అంతంత జ్ఞానోదయ మవుతుంది. జ్ఞానం కోసమని తిరగాలి కాని ఊరకవినోదం కోసమని తిరగరాదు దేశం. ఇంట్లో ఉన్నంతకాలమూ మనం కొన్ని సౌకర్యాలకలవాటు పడి ఉంటాము.
Page 183