జీవితాన్ని ఎక్కడికక్కడ వ్యస్తంగా గాక సమస్తంగా చూడటం నేర్చుకోవాలి. విభక్తంగా కాక అవిభక్తంగా దర్శించాలి. ఇహైవ తైర్జిత స్సర్గః, యేషాం సామ్యే స్థితం మనః అని ఘోషిస్తున్నది గీత. ఎవడి మనస్సు నిత్యమూ సామ్యస్థితి నేమరకుండా ఉంటుందో వాడే సృష్టిని జయంచగలుగుతాడట. జయించటమేమిటి. సృష్టిలో కనిపించే వైవిధ్యం చేత దెబ్బ తినకుండా ఉండటమే జయించట మిక్కడ. అనుకూల ప్రతికూలాలనే ద్వంద్వాలలో ఏది జరిగినా ఒకటేనని భావించటం. నీకు ప్రతికూలమైనది మరొకరి కనుకూలం కావచ్చునని భావిస్తే నీవు కంగారుపడవు. అలాగే నీకను కూలమైనది ఇంకొకడికి ప్రతికూలం కావచ్చునని ఆలోచిస్తే స్వార్థంతో పొంగిపోవు. అలాంటప్పుడేది జరిగినా సృష్టిలో ఒకటే గదా అనే సమదర్శన మేర్పడుతుంది. అలాటి సమదర్శికిక జయమేమిటి అపజయమేమిటి. అంతా జయమే, విజయమే. మహనీయులంతా లోకంలో ఇలాటి ఉదాత్త భావంతోనే తమ జీవితాలు కొనసాగించారు మొదటనుంచీ. వారే సాధు పురుషులు, భక్తులు, జ్ఞానులు, ప్రవక్తలు, జీవన్ముక్తులు, జయంతి తే సుకృతినః అని భర్తృహరి చెప్పినట్టు నిత్య జయశీలురువారు. యద్యదా చరతి శ్రేష్ఠః అన్నారు. అలాటివారి మార్గాన్ని అనుసరిస్తే మనమూ అపజయమెరగని నిత్య విజయాన్నే చవి చూడగలం జీవితంలో, లేకుంటే లోకంలో నీవేలాంటి విజయం సాధించినా మరలా ఎప్పుడపజయం అయినా శాశ్వతంగా అపజయమే. మరి ముందు చెప్పినట్టు ద్వంద్వాలు రెండు నిర్ద్వంద్వంగా చూచే మహనీయుడికి తాత్కాలికంగా కలిగే అపజయం కూడా శాశ్వతికమైన విజయమే.
Page 180