దీపావళి
వినాయకచవితి లాగే దీపావళీ ఒక పండుగే మనకు. ప్రతి ఏటా జరుపుకుంటునే ఉంటాము. ప్రతి పండగవెనకా ఒక అంతరార్థముంటుందని చెప్పనక్కర లేదు. ఇందులో ఉన్న ఆ అంతరార్థ మేమిటి. నరకచతుర్దశి దీపావళి అని రెండురోజులు వస్తాయవి. మొదటిరోజు నరకాసురుణ్ణి వధిస్తాము. రెండవరోజు దీపాలు వెలిగిస్తాము. అది చతుర్ధశి. ఇది అమావాస్య. ఎవడీ నరకాసురుడు. ఎందుకు వధించాలతణ్ణి. అది ఒక పెద్ద కథ. పురాణాలన్నీ కథలు పుట్టలు. ఆ పుట్టలలో ఒక పుట్ట త్రవ్వి చూతాము.
నరకాసురుడని ఒక రాక్షసుడుండేవాడు. ప్రాగ్జ్యోతిష మనేది రాజధాని చేసుకొని పరిపాలిస్తున్నాడు. ఎవడో కాడు వాడు. శ్రీ మహావిష్ణువు వరాహావతారమెత్తి నపుడాయనకూ భూదేవికీ సాంగత్య మేర్పడుతుంది. ఆ సమాగమ ఫలమే ఈ నరకాసురుడు. భూపుత్రుడు. అయితే వాడికా విషయం తెలియదు. బ్రహ్మను గూర్చి దారుణమైన తపస్సుచేసి అంతకన్నా దారుణమైన వరాలు పొందాడు. ఆ వర గర్వంతో స్వర్గం మీద దండెత్తాడు. దేవతలను నానాహింసలూ పెట్టాడు. స్వర్గాధిపతి అయ్యాడు. యాగఫలమంతా నాకే చెందాలని మహర్షులను నిర్బంధించాడు. వారంగీకరించకుంటే గడ్డాలు మీసాలు పెరికి స్రుక్రువాలన్ని ఛిన్నాభిన్నంచేసి వారిని నానా యాతనల పాలు చేశాడు. భరించలేక వారంతా వెళ్ళి ద్వారకావాసి అయిన శ్రీకృష్ణ పరమాత్మకు వినకారు చేస్తారు. ఆయన వాణ్ణి వధించి మీకు మేలు చేస్తానని హామీ ఇచ్చి సత్యాదేవితో సహా బయలుదేరుతాడు యుద్ధానికి. వాడి సహచరులైన మురాదులను మట్టుపెట్టి చివరకు వాణీ సత్యభామా తానూ కలిసి రూపుమాపుతారు. అతని కుమారుడు సహదేవుడు ప్రహ్లాదుడులాంటి వాడు తనకు భక్తుడు. కనుక వాణ్ణి ప్రాగ్జ్యోతిషానికి రాజును చేస్తాడు. వాడి తండ్రి దేవతలమీదికెత్తి పోయినపుడు దేవతామాత అదితి కుండలాలపహరించి తెచ్చి తన చెవులకు పెట్టుకొని తిరిగాడంతకు ముందు. ఇప్పుడా కుండలాలు మళ్ళీ తాను అందిపుచ్చుకొని వాటినా అదితి దేవికి అప్పగిస్తాడు. విజయయాత్ర ముగించుకొని తిరిగి సత్యాదేవితో సహా ద్వరావతి ప్రవేశిస్తాడు. అప్పటి నుంచీ దీపావళి లోకానికి.
Page 152