#


Index

చిత్రతరంగిణి

కనుకనే చవితినాడు చంద్రుణ్ణి చూడరాదు. అలాగైతేనే గణాధీనుడైన ఈ జీవుడు గణాధీశుడయి చతుర్థమైన తన సహజ స్థితిని కాపాడుకొని విఘ్నాలన్నిటినీ రూపుమాపి భద్రమైన శుద్ధమైన మోక్ష సుఖాన్ని పడయగలడు.

  అప్పుడది నిజంగా శుక్లాంబరధరం. శుక్లమైన అంబరమంటే చిదాకాశం. దాన్ని ధరించిన వాడవుతాడు మానవుడు. చిదాకాశ రూపుడయ్యాడంటే విష్ణుమ్ దేశకాల వస్తువులను మూటినీ వ్యాపిస్తాడు. వస్తుతః నిర్వికల్ప రూపుడైనా శశివర్ణం - సవికల్పమైన మనోభూమికలో కూడా వర్తించగలడు. శశి అంటే మనస్సే. మొదటిది స్వరూపస్థితి అయితే రెండవది తన విభూతి. దానితో చతుర్భుజమ్ - ధర్మజ్ఞాన వైరాగ్యైశ్వర్యాలనే సిద్ధి చతుష్టయాన్ని యధేచ్ఛగా భుజించగలడు. అది మరలా గురురూపుడయి శిష్య వర్గానికందించ గలిగితే ప్రసన్న వదనుడనిపించుకుంటాడు. శ్రద్ధాళువులైన శిష్యులకు ప్రసన్నుడయి వదన - బోధిస్తాడని అర్థం. అలాటి గురుమూర్తి అయిన మహాగణపతిని ధ్యాయేత్ ముముక్షువులమైన మనమంతా నిత్యమూ ధ్యానిస్తూ పోవాలి. పోతే సర్వ విఘ్నోప శాంతయే- సాధనమార్గంలో మనకు కలిగే విఘ్నాలన్నీ పటాపంచలవుతాయి. విఘ్నాలీనామరూపాలే. వీటి తాలూకు మనోవృత్తులే. అవి రెండూ నిర్మూలమైతే మిగిలేది మనకిక పరిశుద్ధమూ పరిపూర్ణమైన స్వరూపమే.

Page 151

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు