వారాశ్రయించి తీరాలి. వారంటే ఎవరో కారు మరలా ఆముగ్గురూ. ముగ్గురూ కలిసి నిజానికి మానవులే. ఎందుకంటే సాత్త్విక రాజస తామస గుణాలున్నవారు మన అనుభవంలో మానవులే గదా. అంచేత వీరే ఆ మహాశక్తి నారాధించాలి. ఆ మహాశక్తే వినాయకుడు.
శక్తి అంటే అది అమూర్తం. దాన్ని మనసుకు తెచ్చుకోటం గాని ఆరాధించటం గాని అంత సులభం కాదు. కాబట్టి మానవుడు దానికొక మూర్తి కల్పన చేశాడు. మట్టితో ఒక విగ్రహం తయారు చేసాడు. దానికొక ఏనుగు తల ఏనుగుశరీరం తెచ్చి పెట్టాడు. ఒక మూషికాన్ని దానికి వాహనం చేసాడు. రకరకాల ఆకులూ, కాయలూ పండ్లూ తీసుకువచ్చి దానికాహారం పెట్టాడు. పోతే ఆ దేవత మీద భక్తి శ్రద్ధలెక్కువ చేయటానికెన్నో కథలాయనకు ముడిపెట్టి వర్ణించాడు. పార్వతీ పరమేశ్వరుల ముద్దు బిడ్డ వినాయకుడు. తండ్రికోపానికి గురి అయి శరీరం కోలుపోయి మరలా ఆయన అనుగ్రహంతో గజ శరీరుడయ్యాడు. ఒక దంతం ఒక తొండం - ఒక పెద్ద బొజ్జ ఏర్పడ్డాయి. కుడుములు తినటానికి క్రిందికి వంగబోతే పొట్ట వంగలేదు. అది చూచి చంద్రుడు నవ్వితే వాణ్ణి శపిస్తాడు వినాయకుడు. చవితినాడు తన పూజచేసుకుంటే ఆ చంద్రుణ్ణి చూచినా వారికి నీలాపనిందలు రావని అనుగ్రహిస్తాడు. లేకుంటే కృష్ణ పరమాత్మ అయినా ఆరడిపాలు కావలసిందే తప్పదు.
ఒకనాడీ వినాయకుడు తల్లిదండ్రులకు నమస్కరించి నాకు పెండ్లిచేస్తారా లేదా అని మారాము చేసాడట. బాబూ మీ అన్న కుమారస్వామికి కూడా కాలేదు పెండ్లి. ఇద్దరిలో ఎవరు ముందుగా ఈ భూమిని చుట్టి వస్తే వారికి చేస్తామని మాట ఇచ్చారట అది విని కుమారుడు మయూరవాహనం మీద భూమండలమంతా పరిభ్రమించటానికి బయలుదేరాడు. వినాయకుడు తన మూషికం మాట వినకపోవటంతో చేసేది లేక తల్లిదండ్రులను చెరొకవైపు పీట మీద కూచోబెట్టి మూడుసార్లు వారి చుట్టూ ప్రదక్షిణం చేసి ఇదే భూప్రదక్షిణం ఇక చేయమన్నాడట వివాహం. దానికి వారు సంతోషించి సిద్ధి, బుద్ధి అనే ఇద్దరు కన్యలను తెచ్చి అంటగట్టారట ఆయనకు.
Page 149