లక్ష్యాన్ని సాధించటానికి ఉపకరణంగా మాత్రమే స్వీకరిస్తాడు. అలాకాకపోతే పంచతంత్ర కథలేమిటి చెప్పండి. నిజంగా అవి జరిగాయనేనా కవి ఉద్దేశం. అలాగే భారతాది గ్రంథాలలో ఉపాఖ్యానాలన్నీ జరిగానాయనేనా. లుబ్ధకపోతో పాఖ్యానంలో కపోతం మాటాడిందా. గృధ్ర గోమాయు సంవాదంలో అవి నిజంగా మనుషులతో మాట్లాడాయా.
14. అంతేకాదు. ఒకవేళ ప్రపంచాని కతీతంగా వెళ్లి వర్ణించినా అసలైన కవి సమాజదృష్టిని వదలలేడు. ఆ వర్ణనల్లో కూడా మానవోచితమైన వ్యవహారమే దొర్లుతూ పోతుంది. తన దేశకాలాలను ధ్వనింపజేస్తూనే ఉంటాడు. ఇందుకు మన కావ్యాలన్నీ ఉదాహరణాలే. ఏమాత్రం వివేచన చేసి చూచినా సహృదయులకు చక్కగా బోధపడే విషయమిది. కాకున్నా సాంఘిక చైతన్యం, చైతన్యమని కేకలు పెట్టినంత మాత్రాన ప్రయోజనం లేదు. ముష్క్ ఆసస్త్ కే ఖుద్ బి బూ యద్ - న అన్ కే ఇత్తార్ బి గూ యద్, అన్నాడొక సూఫీ కవి. కస్తూరి అనేది కస్తూరి అని అమ్మేవాడి కేకలో లేదట. అది నిజంగా కస్తూరి అయినందుకు దూరం నుంచే దాని వాసన మనకు తగలాలి. అలాగే సాంఘిక చైతన్యమనేది కూడా నేడు మన చుట్టూ జరిగే పరిస్థితులున్న వున్నట్టు ఏకరువు పెట్టి వ్రాసినంత మాత్రాన రచయితకు సామాజిక దృష్టి ఉన్నట్టుగాదు. ఆ దృష్టి ఉన్నవాడే దేశకాలాలకు చెందిన చరిత్ర తీసుకొన్నా, ఎలాంటి రచన చేసినా తప్పకుండా దానిని సహృదయ లోకానికి నిరూపిస్తూనే ఉంటాడు. అయితే కవి కాబట్టి వాచ్యం చేయడు. వ్యంగ్యంగా సూచిస్తాడు. ఇదే కాళిదాసాది నన్నయాది మహాకవులందరూ చేసిన పని.
15. పైగా మరి ఒక ముఖ్య విషయం మనం గుర్తుంచుకోవాలి. సమకాల సమస్యలెప్పుడూ తాత్కాలికమేగాని సార్వకాలికం కావు. ఆనాటి వారి మెప్పు కోసం వ్రాసిన రచన రేపటికి పాసిపోతే ఏమిసుఖం. కనుకనే మనం సమాజిక దృక్పధంతో వ్రాశామనుకొనే ఎన్నో రచనలు కొంతకాలం చలామణి అయినా కాలాంతరంలో నిలువకుండా పోతున్నాయి. మరి ఈ నాటికీ రామాయణాదులు జన బాహుల్యాన్ని ఆకర్షిస్తున్నాయంటే ఏమిటి కారణం. వాటిలో సార్వకాలికమైన సత్యాలుండటం
Page 136