సామాజిక చైతన్యము : కవి
1. మానవుడు సంఘజీవి అనే మాట మనం మరచిపోరాదు. కవి కూడా మానవుడే. మిగతా మానవులతో పాటు అతడు కూడా సమాజంతో ముడిపడి ఉన్న వ్యక్తే. సమాజంలో తెగదెంపులు చేసుకొంటే అతడు మానవుడే కాడు. మానవుడే కాకుంటే కవి అంతకన్నా కాడు. కాబట్టి ఎంత కళాకారుడైనా కవి అనే వాడికి మానవతా స్పర్శ ఉండి తీరాలి. మానవత్వ మున్నందుకు సమాజ శ్రేయస్సుకు తప్పకుండా కృషి చేయాలి.
2. ఇలాంటి సామాజికమైన స్పృహ కలిగి కృషి చేసిన వారే మొదటి నుంచీ మన కవులంతా. ప్రపంచంలో ఏ సాహిత్యంలో ఏ మహాకవి అయినా అలా చేయవలసిన వాడే చేసిన వాడే. అది వాచ్యంగానూ వ్యంగ్యం గానూ కూడా సాధించారా మహనీయులు. ఆదికవి అయిన నన్నయ దగ్గరినుంచీ ఈనాటి కవుల వరకూ ఈ దృష్టి అంతో ఇంతో మనకు కనిపిస్తూనే ఉంది. తెనుగు కవితకు శ్రీకారం చుడుతూ నన్నయగా రన్నమాట ఏమిటి. విశ్వశ్రేయః కావ్యమ్- జగద్దితంబు గన్. మానవకోటి కంతా అభ్యుదయాన్ని సాధించేదే నిజమైన రచన అని చాటాడాయన. తనకే గాదు. ఈ అభిప్రాయమసలు వ్యాసభగవానుడికే ఉందన్నట్టు విశ్వజనీనమై పరగుచుండ జేసే భారతంబు - అని కూడా ప్రకటించాడు.
3. అనాది నుంచీ కవులకే గాక ఈ సమాజదృష్టి కవితా విమర్శకులైన ఆలంకారికులకు కూడా ఉన్నట్టు మనకు వారి మాటల్లో తార్కాణమవుతుంది. ఆలంకారిక మూర్ధన్యుడైన ఆనంద వర్ధనాచార్యులన్న మాటలివి. వినేయ జన హితార్ధ మేవలోకే నాటకాది గోష్ఠీమునిభి రవ తారితా. భరతాదులైన మహర్షుల వంటి వారే నాటక ప్రయోగాలను ప్రోత్సహించారంటే అది ఎందుకో తెలుసా. పాశవిక ప్రవృత్తి ఇంకా వదలని మానవులకు తద్ద్వారా శిక్షణ ఇచ్చి అదర్శ మానవులుగా తయారుచేయుటానికే నంటారాయన. అంచేత సాంఘిక చైతన్యమనేది కవుల కుండి తీరాలనే సత్య మివాళ మనం క్రొత్తగా కనుగొన్నదిగాదు. కవిత్వమనేది ఆరంభమైన కాలం నుంచి ఉన్నదే అది, కవులకూ ఉందది. కవితా విమర్శకులకూ ఉంది.
Page 132