#


Index

చిత్రతరంగిణి

నిత్య ఆధ్యాత్మికోపన్యాస మహాయజ్ఞము

విద్యారణ్యుల వారి వేదాంత పంచదశీసారము

  1. విద్యారణ్యులు నిజంగా విద్యారణ్యులే. అరణ్యం లాంటి దాయన విద్య. అన్న సాయనాచార్యులు వేదానికి భాష్యం వ్రాస్తే- తమ్ముడు మాధవాచార్యులు వేదాంతానికే భాష్యం చెప్పారు. ఒకరు పూర్వమీమాంసలో అఖండులైతే మరొకరు ఉత్తర మీమాంసలో ఉద్దండులు, మాధవాచార్యులనేది విద్యారణ్యుల పూర్వాశ్రమ నామధేయం, వేదాంత రంగంలో ఆయన రచించిన గ్రంధాలెన్నో ఉన్నాయి. జీవన్ముక్తి వివేకం - జీవన్ముక్తి ప్రకాశిక - అనుభూతి ప్రకాశం వార్తికసార సంగ్రహం సర్వదర్శన సంగ్రహం - ఒకటేమిటి, చాలా ఉన్నాయి. అయితే అవన్నీ ఒక ఎత్తు. వేదాంత పంచదశి ఒక ఎత్తు. ఇది ఆయన రచనలన్నింటిలోకి శిరోరత్నం లాంటిది. శాస్త్రార్ధమూ-అనుభవమూ రెండూ పరిపూర్ణంగా పరమ సులభంగా అందించే గ్రంథమిది.

  2. పంచదశి అంటే పదిహేను అని అర్థం. పదిహేను ప్రకరణాలున్నాయి ఇందులో, అవి మరలా మూడు పంచకాలుగా విభజించారాయన. మొదటి పంచకానికి వివేక పంచకమని పేరు, రెండవదానికి దీప పంచకమనిపేరు. మరి మూడవదానికి ఆనంద పంచకమనిపేరు. మూడు ఇలా వరుసగా పేర్కొనటంలో ఎంతో అంతరార్ధమున్నది. ఏదైనా ఒక సత్యాన్ని మనం ఆకళించుకోవాలంటే మొదట దాన్ని వివేచన చేయాలి. తరువాత ఆ వెలుగులో దానిమీద ఆరోపితమైన అసత్యాన్ని చూడాలి. చూస్తే అది ఆ సత్యంలోనే సమసిపోతుంది కాబట్టి తన్మూలంగా ఏర్పడిన భయం తొలగిపోయి చివరకానందమే మన కనుభవానికి వస్తుంది.

  3. ఇది దాఖలా కావాలంటే రజ్జు సర్పదృష్టాంతాన్నే తీసుకొని చూడవచ్చు మనం. చీకట్లో మనకంటి కొక రజ్జవు సర్పాకారంగా కనిపిస్తుంది. అప్పుడొక దీపం పెట్టి చూచామంటే సర్పానికి మారుగా రజ్జువే మనకు దర్శనమిస్తుంది. రజ్జువని ఎప్పుడు గ్రహించామో అప్పుడిక సర్పరూపం రజ్జవులోనే లయమై తన్ని మిత్తంగా ఏర్పడ్డ భయకంపాదులు తొలగిపోతాయి. అలా తొలగిపోతే అదే ఆనందం.

Page 124

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు