5. ఇలాంటి అఖండాద్వితీయాత్మ భావాన్నే మనక గీత బోధిస్తున్నది. ఈ బోధను అందుకొంటే అదే విషాదానికి మోక్షమని కూడా చెబుతున్నది, మరి దానికి మార్గం అలాటి జ్ఞానాన్ని సాధించటమేనని కూడా చాటుతున్నది. సర్వభూతేషు యేనైకం భావ మవ్యయ మీక్షతే - అవిభక్తమ్ విభక్తేషు తద్ జ్ఞానం విద్ధి సాత్వికమనే ఒక్క మాటలో దీనిసారమంతా ఇమిడి ఉంది. అయితే ఈ జ్ఞానం ఒక్కసారిగా కలిగేది కాదు. అందరికీ లభించేదికాదు. 'మనుష్యాణాం సహస్రేషు' అని ఎన్నో కోట్ల మందిలో ఏ ఒక్కడితో అదైనా బహూనామ్ జన్మనామంతే - ఎన్నో కోట్ల జన్మలు గడచిన తరువాత కడపడి జన్మకుగాని కలగదు. అంతకుముందు జన్మలంతా అలాటి జ్ఞాన ముదయించటానికి శిక్షణ కేంద్రాల లాటివి. ఈ శిక్షణ మార్గంలో కూడా ఒక క్రమమున్నది. మొదటిది కర్మానుష్ఠానం. దుష్కర్మలుమాని శాస్త్రవిహితమైన సత్కర్మ లాచరిస్తూ పోవటం. దీనివల్ల మరీ పామరంగా బ్రతికే వాళ్లకన్నా సంస్కారవంతుడనిపించుకొంటాడు మానవుడు. ఒకనీతి నియమమూ - గురువూ దైవమనే ఉదాత్తభావం కూడా ఏర్పడుతుంది. పోతే రెండవది కర్మయోగం నేను-నాది అనే కర్తృత్వ భోక్తృత్వ బుద్ధి వదిలేసి అంతా ఈశ్వరార్పణమనే బుద్ధితో పనులు సాగించటం. దీనిమూలంగా రజస్తమోరూపమైన మాలిన్యం క్షాళితమై సత్త్వం బాగా శుద్ధి చెందుతుంది. తరువాత మూడవది సమాధి యోగం, ధారణా ద్యానసమాధిరూపమైన ఈ యోగం ద్వారా మనస్సుకు విక్షేపం తొలగిపోయి ఏకాగ్రమవుతుంది. పిమ్మట నాలుగవది భక్తి యోగం. ఇక్కడికి వచ్చేసరికి జీవజగత్తులనే రెండు భావాలూ పోయి కేవల మీశ్వరభావమొక్కటే మిగులుతుంది. కాని ఈశ్వరుడింకా తనకంటే భిన్నమనే చూస్తుంటాడు సాధకుడు. ఏదో ఒక రూపంలోనే దర్శిస్తాడు, ఆరాధిస్తాడు. అలా దర్శించి నంతవరకూ అదితనకు భిన్నమే. భిన్నమైతే అది పరిపూర్ణమైన స్థితికాదు. కాగా అదిగూడా గడిచిపోతే అయిదవది ఆఖరిది జ్ఞానయోగం అక్కడ ఇక ఆ ఈశ్వరుడనే ఒక్క భావం కూడా లయమవుతుంది. లయమై అదికూడా జగత్తులాగా తన ఆత్మ చైతన్యంగానే అనుభవానికి వస్తుంది సాధకుడికి. అంటే ఏమన్న మాట. జీవజగదీశ్వరులనే త్రిపుటి అంతా సంపుటీకృతమై ఆత్మాకారంగా మారిపోయింది. అందుకే సర్వధర్మాన్ పరిత్యజ్య - మామేకం శరణం వ్రజ అని చాటింది గీత. అన్ని ధర్మాలూ అంటే ఏమిటవి. జీవజగదీశ్వరులనే భావాలే.
Page 122