నిత్య ఆధ్యాత్మికోపన్యాస మహాయజ్ఞము
గీతా సందేశసారము
1. "ఆధ్మాత్మ విద్యా విద్యానామ్" అని భగవానుడే సెలవిచ్చిన మాట. ప్రపంచంలో కెల్లా విలువైన పదార్థం విద్య అయితే ఆ విద్య లన్నిటిలోకి శిరోరత్నమైనది ఆత్మ విద్య. మిగతా అనాత్మ విద్యలన్నీ దాని నుంచి ఆవిర్భవించినవే. దానితో పరిసమాప్త మయ్యేవే. కారణ మేమంటే జీవిత సమస్యలన్నిటికి అది ఒక్కటే పూర్తి పరిష్కారాన్ని ప్రసాదిస్తుంది. జీవిత సమస్యలేమిటింతకూ. ఎన్నో లేవు. ఒక్కటే. అదే విషాదం. పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా బ్రతుకంతా విషాదమే మానవుడికి. ఆధ్యాత్మిక-ఆధిభౌతిక-ఆధిదైవికమైన మూడు భూమికలలోనూ మన కెదురవుతున్నదీ విషాదం. దీనికి కారణమీ అనాత్మ ప్రపంచమే. ఇది మనలోపలా వెలపలా వ్యాపించి ప్రతిక్షణమూ మనమీద దాడి చేస్తున్నది. ఇది నాకిలా భిన్నంగా కనపడుతున్నంత వరకూ విషాదం తప్పదు.
2. మరి దీనికి పరిష్కారమేమిటి. దీనిలో నుంచి బయటపడటమే పరిష్కారం. దానికి మోక్షమని పేరు. ఎలా సంభవమది. ఆత్మజ్ఞానం సంపాదించటమే. ఇప్పుడే ఉందిగదా మన కాత్మజ్ఞానం. ఇక క్రొత్తగా సంపాదించటమేమిటి. ఉంది. కాని అది అనాత్మతో కూడిన ఆత్మజ్ఞానం. శుద్ధం కాదు. ఎందుకంటే ఈ శరీరేంద్రియ మనః ప్రాణాలనే ఉపాధుల మేరకే నిలిచిపోయింది మన ఆత్మ. కనుకనే ఈ శరీరాదులకు వెలపల ఉన్నదంతా నేను కాననే భ్రాంతి కది మూలమైంది. దానితో ఆత్మచైతన్యం బాగా సంకుచితమై మిగతాదంతా అనాత్మ ప్రపంచంగా మారి కనిపిస్తున్నది. ఆత్మ అనుకొన్న ఆ కొంచెం కూడా అనాత్మరూపమైన దేహేంద్రియాదులతో కలిసి కల్తీ అయి కూచున్నది. ఇలా ముప్పాతిక మూడు వీసాలు అనాత్మగా మారి దీన్ని గ్రహించే ఏ కొంచెమో మనమాత్మ అని భావించటం వల్లనే ఈ అనాత్మ జగత్తు మూలంగా మనకు శోకమోహాదులన్నీ ఏర్పడుతున్నాయి. కాబట్టి దీనిలో నుంచి ఇప్పుడు బయట పడాలంటే ఒక్కటే మార్గం. అనాత్మగా భావించేది ఏదోకాదు. మన ఆత్మచైతన్యమే సుమా. అదే మన అజ్ఞానంవల్ల ఇలా మనకు వేరుగా కనిపిస్తున్నదని గుర్తించటమే.
Page 120