జ్ఞానమనంతమ్ అదే నామరూపాత్మకంగా కూడా కనిపిస్తున్నది. దాని నిజస్వరూపాన్ని మొదట దర్శించి ఆ చూపుతోనే ఈ నామరూపాత్మక జగత్తును కూడా చూచి ఈ నామరూపాలను కూడా ఎప్పటికప్పుడు తదాత్మకంగానే భావిస్తూ అలా భావించిన ఆ రూపమేదో గాదు భక్తుడు తన స్వరూపమేనని భావిస్తే అదే నిర్గుణ భక్తి, అనన్యభక్తి, అన్యమనే ప్రశ్న లేదిందులో. భక్తుడు - భగవంతుడు - సృష్టి అంతా భక్తుడి స్వరూపంగా పరిణమించినప్పుడిక సంసారమనేది అప్రయత్నంగానే తొలగిపోతుంది. కాబట్టి మోక్షం కూడా అయత్నసిద్ధమే. అయితే అంతవరకూ ఈ మొదటి మూడు భూమికలలో ప్రయాణం చేయాలి సాధకుడు. పరీక్షిత్తుకు ఇలాటి భూమికలు మూడూ ఆయా భక్తుల కథల ద్వారా బయటపెట్టి చివరకు ప్రహ్లాదకుచేలాదుల జీవిత చరిత్రల ద్వారా నిర్గుణ అనన్యభక్తి ఎలాంటిదో నిరూపించి మోక్ష సామ్రాజ్యాని కభిషిక్తుణ్ణి చేశాడు శుకమహర్షి. అది పరీక్షిత్తు మాటలలోనే మనకు వ్యక్తమవుతుంది. "భగవం స్తక్ష కాది భ్యో మృత్యుభ్యో నబి భేమ్యహం ప్రవిష్టో బ్రహ్మనిర్వాణం అభయం దర్శితం త్వయా" స్వామీ నేనిక తక్షకాది మారకుల వల్ల ఎవరి వల్లా భయపడను. నీ వల్ల అభయం పొందాను. బ్రహ్మ సాయుజ్యమే చూరగొన్నానంటాడు. మృత్యుభయం లేదంటే అప్పటికది అమృతమేగదా. ఆనాడెప్పుడో అది పరీక్షిత్తు ఆస్వాదించాడనేగాదు పిబత భాగవతం రస మాలయ మన్నట్టు మనం కూడా ఈ కలికాలంలో పరీక్షాశీలురమై ఆ భాగవతామృతమే త్రావి తరించవలసి ఉంది.
Page 119