#


Index

చిత్రతరంగిణి

నిత్య ఆధ్యాత్మికోపన్యాస మహాయజ్ఞము

భాగవతామృతము

  1. భాగవతము తెలిసి పలుకుట కష్టంబు- అన్నాడు మహాభాగవతుడైన పోతనామాత్యుడు. ఎవరికి కష్టం. తనకా. తనకు కాదు. శూలికైన తమ్మి చూలికైన. శివుడికీ, బ్రహ్మకే కష్టమంటాడు. మరి తనకో, తనకు కష్టంకాదు సరిగదా విబుధజనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపఱుతునని మనకు హామీ ఇస్తాడు. శివుడికీ బ్రహ్మకే కష్టమయినప్పుడది విబుధులకెలా సులభమయింది. విబుధులవల్ల గ్రహించిన పోతన కంతకన్న సులభమెలా అయిందని ప్రశ్న. బ్రహ్మ అంటే రజోగుణానికి ప్రతీక. శివుడంటే తమస్సుకు ప్రతీక. ఈ రెండు గుణాలే జీవజగద్భావాలను రేకెత్తించాయి. జీవజగత్తులనే దృష్టి ఉన్నంతవరకు అంతా భగవత్స్వరూపమనే అఖండ దృష్టి ఏర్పడదు. అలాటి అఖండ దృష్టి రజస్తమో దూషితులుగాని వారికే కలుగుతుంది. వారే విబుధులంటే, వారెప్పుడూ తెలిసే పలుకుతారు. జీవజగదీశ్వరులనే తేడా లేకుండా మూడు తత్త్వాలూ భాగవతమే అంటే భగవత్స్వరూపమేనని అదే దృష్టితో చూడటమే తెలియటం. తెలిస్తే అతడు ఋషి అవుతాడు. అది మరలా లోకానికి తెలిసేలాగా పలికితే కవి అవుతాడు. అలా తెలిసి పలికిన వాడే మొదట నారదుడు. తరువాత వ్యాసుడు, తరువాత శుకుడు. శుకుడు పలికిన ఆ భాగవత రహస్యం విని తరించినవాడు పరీక్షిత్తు.

  2. శుకమంటే చిలుక. అది ఆకాశంలో తిరిగే పక్షి. సంసారవాసనలకు దూరంగా తన చిదాకాశంలో తాను సంచరించే ఆచార్యుడే శుకుడంటే. నిగమకల్పతరో ర్గళితమ్ ఫలమ్. అతడు శాస్త్రజన్యమైన జ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకొని మరలా తన స్వానుభవాన్నే మాటలతో మన కందిస్తాడు. మనం పరీక్షితులమై దాని నందుకోవాలి. అందుకొని పిబత భాగవతం రసమాలయమ్. మన ఈ మనస్సు లేదా జీవభావం లయమయ్యే వరకు ఆస్వాదించాలి, కలికాలాంతంలో ఉన్నాము మనం. మనకీలాటి పరీక్షాబుద్ధి లేదు. అలసులం, మందబుద్ధిబలులం, ఆయుస్సు చూస్తామా అత్యల్పం. అందులోనూ ఎన్నో అవాంతరాలు. వీటితో సుఖశాంతులకు

Page 116

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు