#


Index

చిత్రతరంగిణి

కావ్యేషు మాఘః

1. "కావ్యేషు మాఘః- కవి కాళిదాసః" అని అభిజ్ఞుల మాట. కావ్యాలలో మాఘుడు రచించిన కావ్యంలాంటి కావ్యంలేదు. కవులలో కాళిదాసులాంటి కవిలేడని భావం. చూడబోతే ఇది చాలా విడ్డూరంగా తోస్తుంది. మాఘుడు రచించిన కావ్యం గొప్పదైతే కాళిదాసు గొప్ప కవి ఎలా అవుతాడు. కాళిదాసు గొప్పకవి అయితే మరి మాఘుడు రచించింది గొప్ప కావ్యమెలా అవుతుంది. ఏమిటీ ఆభాణకంలోని ఆంతర్యం. కాళిదాసు గొప్ప కవే సందేహం లేదు. కాని సర్వాంగసుందరమైన కావ్యం మాత్రం మాఘ ప్రణీతమైన శిశుపాలవధ మహాకావ్యమే. ఒక మహాకావ్యాని కాలాంకారికులెన్ని లక్షణాలు చెబుతారో అన్నీ ఉన్నాయందులో. మల్లినాథుడు చెప్పినట్టు "యే శబ్దార్థ పరీక్షణ ప్రణయినో -యేవా గుణాలంక్రియా శిక్షా కౌతుకినో విహర్తు మనసో యేచ ధ్వనేర ధ్వని - క్షభ్యద్భావ తరంగీతే రససుధాపూరే మిమంక్షంతియే తేషామేవ కృతే కరోమి వివృతిమ్ మాఘస్య సర్వం కషామ్" శబ్దార్థ ప్రపంచాన్ని పరీక్షించి తెలుసుకోదలచినవారూ -గుణాలంకారాదులలో శిక్షణ పొందదలచిన వారూ-ధ్వనిమార్గంలో పయనించాలనుకొన్నవారు-నానాభావ తరంగితమైన కావ్యరస సాగరంలో మునిగితేలే అభిలాష ఉన్నవారు- వీరందరికీ ఆటపట్టట మాఘుడి కావ్యం. అంటే ఏమన్నమాట సకల ప్రబంధ లక్షణాలూ ఒక్కచోట రాశీభూతమైన సాహిత్య రచన అది. అందుకే దానిపై వ్రాసే తన వాఖ్యకు సర్వం కష్టమని పేరు పెట్టాడు మల్లినాథుడు. సారస్వత సర్వస్వమూ అందులోనే గుప్తమయి ఉంది కాబట్టి దాన్ని బయట పెట్టటానికి సర్వం కష్టమైన సాధనమే కావలసి వచ్చింది.

  2. కనుకనే ప్రత్యేకంగా కాళిదాసాదు లెంతో గొప్ప కవులే అయినా వారి కవితాగుణాలన్నీ మాఘుని రచనలోనే చోటుచేసుకున్నాయని కీర్తించారు రసజ్ఞులంతా. "ఉపమా కాళిదాసస్య-కాళిదాసుని కవితలో ఉండే ఉపమాలంకార వైభవమూ-భారవేరర్ధగౌరవమ్ భారవి కిరాతార్జునీయంలో కనిపించే అర్ధగాంభీర్యమూ - దండినః పదలాలిత్యమ్ -దండి దశ కుమార చరితలో దొరలిన శబ్ద ప్రయోగ సౌష్ఠవమూ-అదంతా ఒక్క మాఘుడి శిశుపాలవధ మహాకావ్యంలోనే దర్శనమిస్తుంది మనకు.

Page 111

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు