అయితే అది సత్త్వ రజస్తమో గుణాల తారతమ్యాన్ని బట్టి సత్యతపశ్శౌచాది వృత్తులను బట్టి నిరూపించిందే గాని కేవలమొక వంశంలో జన్మించటాన్ని బట్టి కాదు. అంచేత ఎవడెవడు ఆయా గుణాలనూ ప్రవర్తనను అలవరచుకో గలిగితే వారంతా అగ్రజాతి అనిపించుకొనే అవకాశముంది. అలాగే పశుహింసాత్మకములైన క్రతువులు విధించినా అవన్నీ కామ్యకర్మలనీ వాటివల్ల కొంత ఫలమున్నా అది శాశ్వతం కాదని శాశ్వత సుఖమే కావాలంటే వాటన్నిటినీ పరిహరించి బ్రహ్మ జిజ్ఞాస చేయమని చెబుతున్నది శాస్త్రం. అంతేకాదు, నిజమైన యజ్ఞం బాహ్యమైన ద్రవ్యయజ్ఞంకాదు. అది అభ్యంతరమైన జ్ఞానయజ్ఞం. ఆ యజ్ఞంలో వధించవలసిన పశువు వాసనామయమైన మానవుడి మనస్సే. పూర్ణాహుతి చేయవలసిన ద్రవ్యం నానావిధ క్లేశాలకూ నిలయమైన ఈ సంసార చక్రమే అని వేద తాత్పర్యం. ఇది ఈనాడు మనం చేసే వ్యాఖ్యానం కాదు. వేదమే అక్కడక్కడ బ్రాహ్మణాలలోనూ, ఆరణ్యకాలలోనూ తన దృష్టిని తానే వివరిస్తూ వచ్చింది. భగవద్గీతాది గ్రంథాల్లో అదే ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి హిందూమత స్వరూపాన్ని మనం బాగా అర్ధం చేసుకోవాలంటే శ్రుతి స్మృతి పురాణేతి హాసాది వాఙ్మయాన్నంతా మధించి వాటి బాహ్యార్థంకాక అందులోని తాత్పర్యం (Intention on Import) ఏమిటో అవగాహన చేసుకోవాలి. అప్పుడే మన మతమెంత నిర్దుష్టమయినదో అందులో ఎంత సమన్వయదృష్టి ఉందో ఎంత విశ్వజనీనమయినదో బోధపడుతుంది. అలా బోధపడిందంటే అప్పుడీ మతం విశ్వమతమే కాదు విశ్వాతీతమైన మతమని కూడా స్వయంగానే ఋజువవుతుంది. సందేహం లేదు.
ఓమ్ తత్ సత్
Page 104