మన్నారు. పురుష బుద్ధి నుండి ఆవిర్భవించింది కాదది. అయితే ఎలా ఏర్పడింది? 'బ్రహ్మాక్షర సముద్భవమ్' అన్నట్లు అక్షరమైన తత్త్వం నుంచే ఆవిర్భవించింది. సృష్టి స్థితిలయాత్మకమైన పరమేశ్వర సంకల్పమే అక్షర రూపం తాలిస్తే వేదమయింది. వేదమంటే జ్ఞానమనే అర్థం. అఖండ జ్ఞానస్వరూపుడే గదా ఈశ్వరుడు. ఆయన సంకల్పం కూడా జ్ఞానాత్మకమే. కనుకనే అది అక్షరమైంది. వర్ణపదవాక్య రూపమైన రచన ఆ సత్యసంకల్పాని కొక బాహ్యమైన మూర్తి కల్పనమే. స్రష్ట అయిన పరమేశ్వర స్వరూప మెలాంటిదో తత్సంకల్ప రూపమైన ఋగ్వేదాది వాఙ్మయమూ అలాంటిదే. అంచేతనే తృణం మొదలు బ్రహ్మం వరకూ సమస్త విషయాలూ మనకందులో గోచరించటమే గాక మంచీ చెడ్డా అనే తేడా లేకుండా అన్నింటికీ ఒక అద్భుతమైన సమన్వయం కూడా కనిపిస్తుంది వేదంలో. నిగమమని దానికి పేరు పెట్టటం కూడా అందుకేనేమో. నిగమమంటే పరిష్కారం (Conclusion) అని అర్థం. అన్ని సమస్యలకూ శాశ్వత పరిష్కారం చేసింది వేదం. అంచేతనే ఇటు జగత్తత్త్వాన్ని అటు బ్రహ్మ తత్త్వాన్ని రెండింటినీ యధాతధంగా గుర్తించటానికిది ఒక గొప్ప ప్రమాణమై కూచుంది. ఇలాంటి శాస్త్ర ప్రామాణ్యమున్న మతం మనది.
అయితే కొన్ని అపోహల కాస్పద మిచ్చింది మన హిందుమతం. అవి రెండేరెండు. ఒకటి ఇది కొన్ని అగ్ర వర్ణాలవారికే పరిమితమైనదనే అపోహ. మరిఒకటి ‘మా హింస్యాత్ సర్వాభూతాని' అని చెప్పిన శాస్త్రమే 'అగ్నీషోమీయమ్ పశు మాలభేతి’ అని జీవహింసా ప్రధానములైన యజ్ఞాలూ యాగాలూ విధిస్తుందనే అపోహ. ఇవి రెండూ శాస్త్రంలో ఉన్నమాటా వాస్తవమే. కాని అదంతా అంధపరంపరగా వస్తూ ఉన్న ఆచారం. వేద తాత్పర్య మొకటైతే మన మాచరిస్తూ ఉన్నది మరొకటి. వేదమెప్పుడూ అది భౌతికమైన (Material Plane) స్థాయిలోనూ ఆధ్యాత్మికమైన స్థాయిలోనూ (Meta Physical Plane) కూడా ప్రబోధిస్తుంది ధర్మాన్ని. అందులో ఆధ్యాత్మికమే దాని తాత్పర్యం. అందుకు భౌతికాన్ని కేవలమొక ప్రతీక లేదా సంకేతంగా మాత్రమే తీసుకొని చెబుతుంది. మనకీ ప్రతీకలే (Symbols or Media) నిలిచిపోయి వాటి అంతరార్థం మాయమైంది. అంచేత మరలా మనం వేదార్థాన్ని గ్రహించాలంటే బహుజాగ్రత్తగా చూచి గ్రహించాలి. వర్ణవ్యవస్థ అనేది వేదం చెప్పినమాట వాస్తవమే.
Page 103