చివరకెప్పుడో ఒక జన్మకు పరిపూర్ణస్థితి నందుకోలేము. అందుకోసం అనేక జన్మలుండి తీరవలసిందే. ఒకే ఒక జన్మ అంటే తరించే అవకాశం మానవుడికి లేదన్నమాటే. అంతేగాక ఆద్యంతాలు రెండూ లేని కేవల మధ్యస్థితి శాస్త్రీయంగా సమర్థించే విషయం కాదు, మధ్య ముందంటే దాని కాద్యంతాలు రెండూ ఉండవలసిందే. కాబట్టి జన్మ పరంపర ఒప్పుకోక తప్పదు.
అందులోనూ ఇది ఎప్పుడో ఒక శుభముహూర్తాన ఆరంభమైనదని చెప్పటమూ తప్పే. సృష్టి అనేది ఒకప్పుడారంభమైనదికాదు. అది అనాది ప్రవాహన్యాయంగా వస్తూనే ఉంది. ముందుకు పోతూనే ఉంది. అలా కాకపోతే పరమేశ్వరుడే ఈ సృష్టిలోని వైషమ్యానికంతా కారణం అయి కూచుంటాడు. అయితే అయనకే మనం రాగద్వేషాల నంటగట్ట వలసివస్తుంది. ఈ ధర్మసూక్ష్మం హిందువులు గ్రహించినట్లుగా మరి ఎవ్వరూ గ్రహించలేదు. సృష్టి అనాది దాని కాది లేదన్నారు హిందువులు. కాకపోయినా ఆది ఎలా ఉంటుంది. ఉండటానికి లేదు. ఎంచేతనంటే పరమేశ్వరుడి కాది లేదుగదా. ఆయనతోపాటు ఆయన శక్తి కూడా అనాదేగదా. ఆ శక్తి విజృంభణమే గదా ఈ చరాచరసృష్టి అంతా. కాబట్టి తార్కికంగా ఆలోచిస్తే దీనికి ఆది అనేది ఉండటం సంభవంకాదు. ఆది లేకపోతే అంతంకూడా ఉండబోదు. కాని జ్ఞాని అయినవాడు మాత్రం వ్యక్తిగతంగా దీని నంతం చేసుకొనే అవకాశం మరలా ఉంది. ఎందుకంటే ఇది ఈశ్వరుని ఆభాస మాత్రమే. ఈ సృష్టి ఆ భాసమనే ఎఱుక ఎప్పుడుదయిస్తుందో అప్పుడా మానవుడి దృష్టికిది కేవలం ఈశ్వరాత్మకంగా అనుభవానికి వస్తుంది. ఇక సృష్టిలేదు. దానివలన కలిగే నష్టిలేదు.
సృష్టి అనేది ఇలా ప్రాతిభాసికమే Apparent గాని వాస్తవం కాదు గనుకనే జీవన్ముక్తిని కూడా అంగీకరించింది హిందూమతం. మిగతా మతాలవారు విదేహముక్తి తప్ప జీవన్ముక్తి సంగీకరించరు. శరీరమనే ఉపాధి ఉన్నంతవరకు ముక్తి ఏమిటని వారి ఆక్షేపణ. మనవారికి శరీర ముండటంతోనూ లేకపోవటంతోనూ నిమిత్తం లేదు. అలాగైతే మృతే ముక్తి అని చెప్పినట్టవుతుంది. శరీరం వరకే కాదు ప్రపంచమంతా వ్యాపించి ఉన్నానని భావించటమే ముక్తి. భావించటమే అయినప్పుడా భావన శరీరమున్నప్పుడూ కలగవచ్చు. శరీరం లేకపోయినా కలగకపోవచ్చు. ఇంకా శరీర
Page 101