అదే ఈ గాయత్రీ మంత్రోపదేశం. మంత్రాణా మర్ధ స్తిరోహితో భవతి అన్నారు పెద్దలు. ఇంత విస్తరించి చెప్పవలసిన భావ మొక్క చిన్న మాటలో చెబితే ఏమర్ధ మవుతుంది మనకు. అందుకే గుప్తమైన దాన్ని మరలా మనం విస్తరించి చెప్పుకోవలసి వస్తున్నది. భూర్భువ స్సువః అనే వ్యాహృతులు మూడూ తేజో బన్నాలకు సంకేతాలే. సువః తేజస్సు. భువః జలం. భూః పృధివిం క్రింది నుంచి పైకి చేయాలి కాబట్టి ప్రయాణం భూః అనే మాటతో ఆరంభించారు. మూడింటికీ కలిసి ఓమ్మనేది ఆధారం. ఆ ఏకాక్షరంలో గుప్తమయి ఉన్నాయీ మూడూ. అ ఉ మ. ఇదే ఓమ్మనే మాటగా తయారయినాయి. అ ఉ మాలు భూర్భువస్సువస్సులే. అది ఏదో గాదు ఆ ఓమ్మరలా. తత్. తత్తంటే అది. ఆ పరమాత్మ అని అర్ధం. మనకిప్పు డాయన పరోక్షం కాబట్టి తత్తన్నారు.
మరి పరోక్షమైనది పరోక్షంగానే ఉంటే ఎలా. ప్రత్యక్షమైతే గదా. సవితుః - అంచేత సవిత అయిందది. ప్రసవిస్తుంది. ఏమిటి. తేజస్సా. తేజస్సే గాదు. తేజస్సనేది ఉపలక్షణం. తేజస్సు వల్ల జలం. జలం వల్ల అన్నం. ఇవన్నీ కలిసి వస్తాయి ఆ మాటలో. అది ఎలా ఏర్పడిందా తేజస్సు. భర్గః - భర్గ్ అంటే లాటినులో Freg ఆంగ్లంలో Break. అన్నిటికీ ఒకటే అర్ధం. స్ఫూటితం కావటం ప్రేలటం. పగలటం. ఆ దివ్యశక్తి స్ఫుటితమైతే గాని సృష్టి జరగదు. తేజోబన్నాత్మకం గదా సృష్టి.
Page 153