#


Index

పరిసమాప్తి

  రామగీత ఇక్కడికి సమాప్తమయింది. భరతుడు వానరులనేది ఒక నెపం. అర్జునం నిమిత్తీకృత్య అన్నట్టు వారిని నిమిత్తంగా చేసుకొని కృష్ణుడి లాగానే రాముడు మానవ సమాజానికంతా చేసిన మహోపదేశమిది. మహత్త్వం పరిమాణంలో కానక్కరలేదు. గుణంలో ఉండాలి. ముందు చెప్పినట్టు కృష్ణగీతలోని ఏడువందల శ్లోకాల తాత్పర్యమూ ఈ రామగీతలో చాలా క్లుప్తంగా గుప్తంగా కనిపిస్తుంది మనకు. ఒక్కమాటలో చెబితే జ్ఞానమూ కర్మా ఇవి రెండే ఏ గీత చెప్పినా చెప్పగలిగింది. ఇందులో కర్మ అనేది నిషిద్ధం కాక విహితమైన దాచరిస్తే మరణానంతరం మానవు డుత్తమ లోకాలూ ఉత్తమ జన్మలూ ఉత్తమ సుఖాలూ ఇలాటి అభ్యుదయం సాధించగలదు. మరి జ్ఞానం కూడా సాపేక్షం కాక నిరపేక్షమైన బ్రహ్మ జ్ఞానమే గడిస్తే మరణమనే ప్రసక్తే లేక అజరామరుడై అనంతమైన ఆత్మ సామ్రాజ్యానికే పట్టాభిషిక్తుడై తన స్వరూపంలో తానుండి తన కన్యంగా కనిపించేదంతా తన విభూతిగా దర్శిస్తూ పోతాడు. ఇదీ రామకృష్ణా భయగీతా తాత్పర్యం. ఇందులో మనబోటి నరుల మందరమూ ధర్మంవరకే ప్రయాణం చేసి నరోత్తముల మవుతామో లేక జ్ఞానమనేది ఆర్జించి చివరకు నారాయణత్వాన్నే అందుకొని తరిస్తామో మనమే నిర్ణయించుకోవలసి ఉంది.

Page 71