పోతే ఇక హనుమ త్పురాగమనా నంతరం సేనా సహితుడయి సముద్రతీరం చేరి సముద్రుణ్ణి దారి ఇవ్వమని కోరి అతడు పలకక పొతే దానిపైన బ్రహ్మాస్త్రం సంధిస్తాడు. దానితో సముద్రుడేగాక త్రిలోకాలు ఆకులమై పోతాయి. అతడు భీతభీతుడై వచ్చి దాసుడి తప్పు మన్నించమని ప్రాధేయపడతాడు. ఇక్కడ దాఖలా అవుతుంది రాముడి దివ్య స్వరూపం మనకు. మామూలుగా బయటపడదది. మానుష వేషంలో మరుగుపడి ఉంటుంది. ఎప్పుడో సమయంచూచి పడగవిప్పుతుంది. అప్పుడర్థ మవుతుంది దాని ప్రభావం మనకు. విభీషణుడు హఠాత్తుగా వచ్చి శరణు వేడటం - సుగ్రీవాదులను సలహా అడగటం వారు వద్దని చెప్పినా శరణాగత రక్షణం తన కర్తవ్యమని చెప్పి అతని నాదరించటం - ఇదంతా ఒక అభినయమే. అంతేకాదు. ఇంకా లంకలో ప్రవేశించింది లేదు. రావణ సంహారం చేసిందిలేదు. అప్పుడే అంతా జరిగిపోయినట్టు విభీషణుడికి లంకా రాజ్యాభిషేకం చేస్తాడు. ఇది మరీ సాహసం. అల్పజ్ఞుడైన మానవుడికైతే సాహసం. సర్వజ్ఞుడు పరమాత్మ. సర్వజ్ఞుడు గనుకనే రావణుడు చస్తాడని తెలుసు. తాను గెలుస్తానని తెలుసు. గెలిస్తే ఇక దానవ రాజ్యానికి. విభీషణుడే వారసుడనీ తెలుసు. అలా తెలిసే చేశాడనుకోవాలి ఈ అభిషేకం.
అనంతరం యుద్ధకాండలో ఇంద్రజిత్తు వల్ల అన్నదమ్ములిద్దరూ నాగపాశ బద్దులవుతారు. అప్పుడు అంతరిక్షం నుంచి గరుత్మంతుడే స్వయంగా వచ్చి పాశచ్ఛేదంచేసి వెళ్ళిపోతాడు. ఇదికూడా రాముడి విష్ణుతత్త్వానికి నిదర్శనమే. అంతేకాదు. రావణుడితో పోరాడే సందర్భంలో దేవసారధి మాతలి స్వయంగా ఒక దివ్యమైన రథం తీసుకువస్తాడు రాముడి దగ్గరకు. ఇదీ తార్కాణమే మనకు. అంతేకాదు. రావణ వధానంతరం యుద్ధభూమికి మందోదరి వచ్చి ఆక్రందన చేస్తూ ఇలా అంటుంది. కథమ్ జఘానత్వాం - మానుషో వనగోచర: ఒక మానవుడు నిన్ను వధించటమా, నేను నమ్మలేను.
Page 28