#


Index

మరి వాడు వస్తేగాని సీతాపహరణం జరగదు. అందుకు నిమిత్తం మారీచుడు కావలసి ఉంది. అది ముందుగా తెలిసే తాను బాల్యంలో సుబాహుణ్ణి చంపినా వాణ్ణిమాత్రం చంపకుండా దండకలో పారవేయటం, పూర్వాపరాలు కలిపి చూచుకొంటే ఎంత నాటక మాడాడో చూడండి రాముడు. త్రికాలదర్శి భగవానుడు కాకుంటే ఆడగలడా ఈ నాటకం. పైగా సీత ఆ మృగాన్ని చూచి ప్రలోభపడటం - దాన్ని పట్టి తెమ్మని తన్ను బలవంతం చేయటం - అలాంటి అద్భుతమైన మృగమెక్కడా ఉండదని చెబుతూనే దాన్ని ఆమె కోసం పట్టి తెస్తానని పంతగించటం కూడా వింతగానే ఉంది. లక్ష్మణు డిదంతా రాక్షస మాయ అని చెప్పినా మాయ అయితే మరీ మంచిది దాన్ని ఛేదించటం కూడా మన కర్తవ్యమేగదా అని తన చర్యను సమర్ధించ బూనటం కూడా చిత్రమే. చిత్రమే మరి. భగవల్లీల లన్నీ చిత్రమే మనపాలిటికి.

  తరువాత సీతా వియోగంవల్ల ఏర్పడిన పరితాప మింతా అంతాగాదు. అంతకు ముందంత బరవసా. ఆ తరువాత ఇంత వేదనా - ఇదీ ఒక లీలే. ఒక ప్రదర్శనే. ఇంతలో కబంధ ప్రతిరోధమూ - అతడి శాపవిమోచనమూ సుగ్రీవుడితో సఖ్యంచేయమని బోధించటమూ ఇది కూడా భావిసూచనే. శరభంగుడి దగ్గనుంచీ ప్రతి ఒక్కరూ ముందుకు నడుపుతూనే ఉన్నారు తన్ను. తన అవతార ప్రయోజనాన్ని తనకు గుర్తు చేస్తూనే ఉన్నారు. వారు చేయటం కాదు. వారి ద్వారా తనకు తానే చేసుకొంటున్నాడు. వారు కేవలం నిమిత్త మాత్రులే. కనుకనే ఎవరేది చెప్పినా తనకేది చేతికిచ్చినా మౌనంగా వింటూ మౌనంగానే స్వీకరిస్తూ వచ్చాడు. తన ప్రణాళిక వారు సూచిస్తుంటే తనలో తాను సంతోషిస్తున్నాడు. ఇప్పుడూ అంతే. వాలి సుగ్రీవులిద్దరిలో వాలి పరాక్రమశాలి అయినా మంచివాడు కాడు సుగ్రీవుడే స్నేహపాత్రుడని చెబితే- అదేమిటి బలవంతుడితోనే గదా సఖ్యం చేయవలసిందని ప్రశ్నించకుండా అలాగేనని కిష్కంధకు బయలు దేరుతాడు.

Page 26