స్వరూప ప్రత్యభిజ్ఞ
భాగవత మయింది రామాయణ మయింది భారత మయింది. సాహిత్య తత్త్వాన్వేషణ యాత్రలో మూడు గొప్ప మజిలీలు దాటి వచ్చా మిప్పటికి. అవి మూడూ పురాణేతిహాసాల పరిషత్తులో విశిష్ట సభ్యులు. వాటికా విశిష్టత కల్పించిన వారు వ్యాస వాల్మీకుల లాటి మహర్షులు. పోతే అలాటి మహర్షుల స్థాయి కెదిగి వారి సృష్టి చిత్రాలను మరొక రీతిలో చిత్రించి చూపిన మహా కవి ఒకడున్నాడు. అతడొకడే ఉన్నాడు మహా కవి. ఎవడతడు. ఇంకెవడు. పురా కవీనాం గణనా ప్రసంగే కనిష్ఠికా 2 ధిష్ఠిత కాళిదాసా-అద్యాపి తత్తుల్య కవే రభావా దనామికా సా 2 ర్ధవతీ బభూవ అని భావుక లోకం చేత ఎక్కడ లేని ప్రశంస లందుకొన్న కాళిదాస మహాకవి. గతంలోనే కాదు. ఇప్పుడీ వర్తమానంలోనూ మన ప్రాచ్య దేశాల లోనే కాదు - పాశ్చాత్య దేశాలలోనూ కవి అన్నా మహా కవి అన్నా ఒక్క కాళిదాసే -మరెవరికీ లేదలాంటి హక్కనిపించుకొన్న వాడాయన. వాల్మీక్యాదుల వంటి ఋషికల్పుడైన కవి గనుకనే ఆయన మహా కవి శబ్ద వాచ్యు డయినాడు. మహత్త్వ మాయనలోని ఋషిత్వాన్ని సూచిస్తే - కవి శబ్ద మాయన లోని కవితా ప్రాభవాన్ని చాటుతుంది. మరెవరిలో లేదింతటి ప్రతిభ. మిగతా వారందరూ కవులే గాని మహా కవులు గారు. అందుకే నేమో ఆలంకారిక మూర్ధన్యు డానందవర్ధనుడు ద్విత్రాః పంచషా వా మహా కవయ ఇతి గణ్యంతే అని వ్యాస వాల్మీకుల ప్రక్కన కాళిదాసు కొక్కనికే సింహాసనం వేసి కూచోబెట్టాడు. ఋషులలో కవి కవులలో ఋషి కాళిదాసు. రాజ్యాశ్రమమునిం మునిః అని ఆయనే ఒకచోట నర్ణిస్తాడు. వసిష్ఠాదులు మునులయితే రఘువంశ రాజులు రాజ్యమనే ఆశ్రమంలో మునులట. అలాగే వ్యాసాది మహర్షులు అరణ్య సీమలలో నివసించిన ఋషులయితే ఈయన పట్టణాలలో నివసిస్తూ వచ్చిన ఋషి, ప్రాచీనులలో నవీను డీయన. నవీనులలో ప్రాచీనుడు. ప్రాచీనులైన
Page 1