పూర్ణానుభవము
మనలో మాట
ఇది ఒక చిన్న రచన. పరిమాణంలో చిన్నదైనా గుణంలో పెద్దదే. ఇది నేను వ్రాయాలనుకొని వ్రాసిందికాదు. మొన్న చైత్రంలో నేను పాలకోడేరు ఆనందాశ్రమంలో కొన్నాళ్ళపాటు వేదాంత ప్రవచనం చేస్తూ వచ్చాను. ఆ సందర్భంలో అక్కడికి నమీనంలో ఉన్న బేతవోలు ప్రణవానందాశ్రమం నుంచి స్వామీజీ నాకక్కడికి రమ్మని కబురంపారు, తమ ఆశ్రమానికి కూడా వచ్చి కనీసం ఒక వారం రోజులైనా నేనక్కడ ప్రవచనం చేస్తే వినాలని ఆయన అభిలాష, అందులోనూ మాండూక్య మంటే ఆయనకు ప్రాణం. అవస్థాత్రయ విచారంద్వారా తురీయస్థితి నందుకొనే ప్రక్రియ మరలా ఒకసారి చక్కగా అనుసంధానం చేసుకోవాలని ఎంతగానో మననులో ఉందాయనకు. మరి తురీయాశ్రమ వాసులకు కాకుంటే ఎవరికుంటుంది తురీయ జిజ్ఞాస.
ఆ స్వామీజీ అంటే నాకెనలేని గౌరవం. కారణం ఆయన అసలైన స్వామి కాబట్టి. అంచేత వయోవృద్ధుడూ జ్ఞానవృద్దుడూ అయిన ఆ స్వామి కోరిక తీర్చటం నా కర్తవ్యమని భావించి పాలకోడేరు కార్యక్రమం ముగియగానే ప్రణవాశ్రమం బయలుదేరి వెళ్ళాను. భాగవతం బాణీలో ఏడు రోజులు మాండూక్య విచారం అనర్గళంగా సాగింది. మూలమూ మూలంమీద గౌడపాదుల కారికలూ, వాటిమీద భగవత్పాదుల భాష్యమూ, అన్నీ కలిపి ఎంతగా మననం చేయాలో అంతగా చేశామిరువురమూ. మాతోపాటు మరికొంతమంది శ్రోతలు కూడా పాల్గొన్నారా జ్ఞానయజ్ఞంలో, మనం తరించి పదిమంది తరించాలనే ఉదాత్తమైన దృక్పథ మా స్వామిది.
ఆఖరి రోజు ఆగమ ప్రకరణానికి శాంతి పఠించి ఇంకా ఒకపూట ఖాళీగా ఉంటే నిర్వ్యాపారంగా గడపటం దేనికని దాని కనుబంధంగా మూడు గాథలు చదివి వాటి అర్థాన్ని వివరించాను.
Page 3