అదే ఇంతకు ముందు మనం ఇనుప గుదియ దృష్టాంతంలో చెప్పుకొన్న రహస్యం. సహజంగా శీతలమైన గుదియకు ఉష్ణగుణం అగ్ని నుండి సంక్రమించి నట్టే స్వయంగా అచేతనమైన మనస్సుకు చైతన్యమనేది ఆత్మ వల్లనే సంక్రమిస్తున్నది.
ఈ చైతన్య రూపమైన ఆత్మ అప్పటికి మనః ప్రాణాదులన్నిటి కంటే విజాతీయమైనది. శరీర మనః ప్రాణాదులు భౌతికమైతే అది అభౌతికం. ఇవి అచేతనమైతే అది శుద్ధచైతన్యం. చైతన్యం గనుకనే అది నేను నేననే స్ఫురణ కలిగి ఉంటుంది. ఇలాంటి స్ఫురణ శరీరాది సంఘాతానికి లేదు. మనసు కున్నట్టు కనిపించినా అది దానివల్ల తాత్కాలికంగా సంక్రమించినదే. అది నిశ్చలమైన సాగరమైతే ఇది దానిలో నుండి పైకి లేచిన తరంగం లాంటిది. ఆలోచనలన్నీ తరంగాలే. చలిస్తే తరంగం. చలించకుంటే జలం. అలాగే చలించిన జ్ఞానమే మనస్సనుకొంటే చలించకుండా ఉన్న దశే ఆత్మ. అది ఈ శరీరంలో ఉన్నట్టు భాసించినా శరీరంతో దానికేలాంటి సంపర్కమూ లేదు. ఇది ఎలాంటిదంటే నానాచ్ఛిద్ర ఘటోదరస్థిత మహాదీప ప్రభా భాస్వరం. ఒక ఘటమున్నది. దానికి చిన్నవీ పెద్దవీ అనేక రంధ్రాలున్నాయి. అందులో ఒక దీపం తెచ్చి పెట్టామనుకోండి. అప్పుడేమవుతుంది. ఆ దీప కాంతి ఘట రంధ్రాల ద్వారా బయటికి ప్రసరిస్తుంది. దానిలో ఆ ఘటమూ ఘట రంధ్రాలూ వెలుపల ఉన్న అన్ని వస్తువులూ కూడా ప్రకాశిస్తాయి.
ఇప్పుడా దీపం ఘటంలో ఉన్నంత మాత్రాన ఘటమే దీపమవుతుందా. దీపానికి ఘటానికీ తేడా లేదా. ఘట జాతి వేరు,
Page 42