#


Back

Page 101

సాధక గీత

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు


(ఉత్తరార్థమ్)


101
సర్వభూతేషు యైనైకం-భావ మవ్యయ మీక్షతే
వినశ్యత్స్వ వినస్యన్తం-తద్జ్ఞానం విద్ధిసాత్త్వికం 18-20

అయితే జ్ఞానం జ్ఞానమని ఇంతగా ప్రశంసిస్తున్నారు. ఏమిటా జ్ఞానం ఎలా అభ్యసించాలది అని ప్రశ్న వస్తుంది. ఎన్నోమార్లు విన్నదే అయినా పరమపద సాధన విషయంలో మరలా దాన్ని ప్రపంచించటం ఎంత్రెనా మంచిది.

సాత్త్వికమైన జ్ఞానమే జ్ఞానమన్నారు తత్త్వజ్ఞులు. సాత్త్వికం రాజసంతా మసం అని అసలది మూడు విధాలు. అందులో తామసమనేది నామరూపాలను మనసుకు తెచ్చే ప్రాపంచిక జ్ఞానం ordinary. రాజసం శాస్త్రాలకూ కళలకూ సంబంధించిన వైజ్ఞానిక విషయం scientific. పోతే రెండింటికీ మూల భూతమైన ఏ అధ్యాత్మిక జ్ఞానమున్నదో అది Spiritual సాత్త్వికం.

ఈ సాత్త్వికమే అసలైన సిసలైన జ్ఞానం వాస్తవానికి. ఎందుకంటే అది అవ్యయం. ఏమాత్రమూ వ్యభిచారం లేనిది. ఎంచేత. దానికి విషయమైన పరమార్ధం కూడ వ్యభిచారం లేనిదే, వ్యయమన్నా వ్యభిచారమన్నా ఎప్పటికప్పుడు మారిపోవటమని అర్ధం. అలాంటి మార్పు మిగతా రెండు జ్ఞానాలలోనూ ఉంటుంది గాని దీనిలో ఉండదు. ఇక్కడ జ్ఞేయమైన పరతత్త్వమెలా మారదో దాన్ని గోచరింపచేసుకొనే జ్ఞానం కూడా అలాగే మారదు. ఎప్పుడూ ఏక రూపంగానే ఉంటుంది.

అది ఎలాగని అడగవచ్చు. పరతత్త్వ మనేది సమస్త భూతాలలోనూ సమానంగా పరచుకొని ఉన్న ఒకానొక భావం. భూతాలంటే అవి జడ పదార్థాలే కాదు. చేతనాలు కూడా. రెంటికీ భూతమనే శబ్దం వర్తిస్తుంది. అప్పటికి నామరూప క్రియాత్మకమైన సృష్టి అంతా కలిసి వస్తుంది ఈ మాటలో. ఈ సృష్టిలో ఎక్కడికక్కడ విశేషాలూ కనిపిస్తాయి. మనకు వాటన్నిటినీ వ్యాపించిన సామాన్యమూ కనిపిస్తుంది. ఒక సువర్ణంతో చేసిన రకరకాల అభరణాలు చూస్తే ఆభరణాలుగా అవి అనేకమైనా వాటిలో ఏకరూపంగా సువర్ణమే కనిపిస్తుంది మనకు. పోతే ఈ సువర్ణం కూడా రజతతామ్ర - కాంస్య- త్రపు సీసాదులైన లోహాలన్నిటి దృష్ట్యా చూస్తే అదీ ఒక లోహవిశేషమే. అప్పుడా విశేషాలన్నిటిలో లోహజాతి అనే సామాన్య మేకరూపంగా సాక్షాత్కరిస్తుంది.

ఇలాకాక ఈ సామాన్య విశేష పరంపర ననుసరిస్తూపోతే చివరకీ నామ రూపొదులన్నీ విశేషాలయిపోయి వీటన్నిటినీ సమానంగా వ్యాపించిన ఒక మహా సామాన్యం దర్శనమిస్తుంది మనకు. దానిని మించిన సామాన్యం మరొకటి లేదు కాబట్టి అది పర Supreme మన్నారు. మారకుండా నిలిచేది కాబట్టి తత్త్వ మన్నారు అయితే ఇవన్నీ మారి అది మారకపోవటమేమిటి. దాని స్వరూపమే అలాంటిది గనుక. ఏమిటా స్వరూపం. సచ్చిత్తులే దాని స్వరూపం. సత్తంటే ఉనికి. చిత్తంటే ఎరుక. ప్రతి ఒక్క పదార్థామూ లోకంలో ఉంది, ప్రకాశిస్తుంది. ఉండకుంటే ప్రకాశించేది లేదు. ప్రకాశించకుంటే మనం దాన్ని గ్రహించేది లేదు. కాబట్టి మనమొక పదార్ధాన్ని గ్రహిస్తున్నామంటే ఆ పదార్థంతో కలిపి సచ్చిత్తులను కూడా పట్టుకొంటున్నామనే అర్ధం. అవి ఆ పదార్ధం ఆది మధ్యాం తాలలో లోపలా వెలపలా ప్రతి అణువూ వ్యాపించే ఉండాలి. ఎక్కడ ఏ భాగం వ్యాపించకపోయినా ఆ భాగం మన మనసుకు రావడానికి వీలులేదు. అవి ఉంటేనే పదార్థం. లేకుంటే లేదు. అంటే ఏమన్నమాట. సచ్చిత్తులే ఉన్నాయి వాస్తవానికి. అవే ఆయా పదార్థాల రూపంగా మనకు భాసిస్తున్నాయి. కనుక ఈ ఆభరణాలన్నీ బంగారమే గదా - అని చూచే వాడికి ఆభరణ రూపాలన్నీ బంగారంలో లీనమయి కేవలం పచ్చగా మెరిసే ఒక బంగారమే ఎలా దృష్టికి గోచరిస్తుందో - అల్లాగే ఈ నామరూపక్రియలన్నీ కేవలం సత్తే గదా - చిత్తే గదా - అని చూడ గలిగితే చాలు. ఆకాశంలాగా మనలోపలా వెలపలా సర్వత్రా పరచుకొని ఒక వెలుగులాగా ప్రకాశించే స్ఫురణ Awareness ఒకటి మనకు తప్పకుండా సాక్షాత్కరిస్తుంది.

అప్పటికిక ఏదీ మిగలకుండా అన్నీ అందులో లయమయ్యేవే. దానికి నామరూపాలుండబోవు. నామరూపాలు లేకుంటే అది చలించే ప్రశ్న లేదు. అవ్యయమే అవుతుంది. అంతేకాదు. మిగతా భూతప్రపంచమంతా నశిస్తున్నా అది నశించదు. ఎప్పటికీ అదే రూపంలో ఉంటుంది. కారణం - అది నిషయమేగాక మనకు విషయి కూడ. అంటే మనమే. మనం నశిస్తున్నామనే స్ఫురణకూడా మనకే రావాలి కాబట్టి నశించటమనే క్రియే అసంభవం. అదీ నా స్వరూపంలోనే చేరిపోతుంది. పోతే ఇక నాశమే లేదు. కనుకనే అది అభావం కాదు. భావం భావమంటే అది సిద్దమేగాని మనం క్రొత్తగా సాధించేది కూడా కాదు. సాధన ఎంతవరకంటే ఉన్నదున్నట్లు మరలాదాన్ని మానవుడుజ్ఞాపకం చేసుకోవటమే. మరేదీ కాదు.